164 సీట్లతో చరిత్ర ఎరుగని విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి పార్టీలు అధికారం చేపట్టగానే ఇక ఈ ఐదేళ్లు మనల్నెవడు రా ఆపేది అన్న అహంకారంతో కాకుండా మనదే బాధ్యత అన్న ఆదర్శంతో ముందుకెళ్తున్నారు.
మొదటి సారిగా ప్రజా తీర్పుతో అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి హాజరైన నారా లోకేష్ నాలుగు దశబ్దాలుగా గెలుపు అనే దారి కనపడని మంగళగిరి ప్రాంతాన్ని టీడీపీ కంచుకోటగా మార్చి తన తండ్రి నారా చంద్రబాబు నాయుడుకి బహుమతిగా అందించారు.
అయితే ఎంతో నమ్మకంతో తనను అసెంబ్లీకి పంపించిన మంగళగిరి వాస్తవ్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉదయం 8 గంటలకు ప్రజా దర్బార్ పేరుతో ప్రజల నుండి వినతి పత్రాలు, సమస్యల చిట్టాలు స్వీకరిస్తున్నారు లోకేష్.
అలాగే వాటి పరిష్కారాలకు కూడా తగిన ఆదేశాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు లోకేష్. అయితే ఇదే తీరుగా అధికారం ఉన్నాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుకు వెళ్లగలిగితే ఇక లోకేష్ ను వెనక్కి లాగడం వైసీపీ తరం కాదు.
అలాగే పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలుపొంది 100 % స్ట్రైక్ రేట్ తో దూసుకుపోయిన జనసేన అధినేత పవన్ కూడా అటు పార్టీని, ఇటు తనకిచ్చిన శాఖలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. పదేళ్ల పోరాటాలకు, అవమానాలకు పవన్ కు పిఠాపురంలో పరిష్కారం దక్కింది.
ఓడిపోయావ్..ఓడిపోయావ్ అంటూ గేలిచేసిన నోళ్లే ఇప్పుడు తగ్గాడు..నెగ్గాడు అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. తనను నెగ్గించిన ప్రజల పట్ల ఇంకా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు పవన్. నేడు అసెంబ్లీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనసేన పార్టీ ఆఫీస్ కు చేరుకున్న పవన్ కు ప్రజానీకం అర్జీ కాగితాలతో ఎదురొచ్చారు.
గత ఐదేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన ప్రజలంతా వారి వారి నాయకుల వద్దకు వచ్చి ఇన్నాళ్లుగా పరిష్కారం దొరకని తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. పవన్ కూడా అలిసిపోయానని కానీ, సమయం లేదని కానీ, ఆఫీసులో ఇచ్చి వెళ్ళండి అని వారిని వారించకుండా పార్టీ కార్యాలయం బయటనే కుర్చీ వేసుకుని తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను ఆలకిస్తున్నారు.
వినడమే కాదు అందుకు సంబందించిన అధికారులను సమస్య పరిష్కారానికి దారులు వెతకమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గడప గడప కు మన ప్రభుత్వం అంటూ మంత్రులు, ఎమ్మెల్యే లే ప్రజల తలుపు కొట్టినప్పటికీ ఆ కార్యక్రమం కేవలం జగన్ భజన చేయడానికే కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి కాదనేది స్పష్టమయింది.
వేల కోట్ల బటన్ నొక్కాను అయినా ఎందుకు ఓడిపోయాను అంటూ ఆలోచిస్తున్న జగన్ కు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా అర్దమయ్యిందో లేదో. అధికారం కోసం ప్రజల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన జగన్ అధికారం రాగానే అదే ప్రజలను తన కాళ్ళ కింద తొక్కి పెట్టారు. సమస్య ఉంది అంటూ ఎవరైనా గొంతెత్తితే కేసులు పెట్టి అరెస్టులు చేయడం.
అర్జీలు పట్టుకుని గెలిచిన సొంత పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీ లు వస్తేనే తన అపాయింట్ మెంట్ ఇవ్వకుండా రోజుల తరబడి తన ప్యాలస్ చుట్టూ తిప్పించుకోవడం, పోలీసులను పెట్టుకుని ఆంక్షలు విధించడం, బయటకు వస్తే పరదాలు కట్టుకుని వెళ్లడం ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో చూసి చూసి విసిగి పోయిన ప్రజానీకం మార్పు కోసం సరిహద్దులు దాటి మరి వచ్చి ఓటేసి వెళ్లారు.
ఇపుడు ఆ మార్పు ను స్పష్టంగా రాష్ట్ర ప్రజానికానికి చూపిస్తున్నారు కూటమి నేతలు. మంత్రులుగా అవకాశం అందుకున్న నేతలందరూ వారివారి శాఖల మీద సమీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలకు ఆదేశాలిస్తున్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాలన్న పాస్ పోర్ట్ కావాలి అనే విధంగా ఆంక్షలు ఉంటే ఇప్పటి ప్రభుత్వంలో తాము ఓటేసి ఎన్నుకున్న నాయకుడిని నేరుగా కలవడానికి కూడా ఎటువంటి షరతులు లేవు.
ఇది మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా…పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పాలన కాకుండా కూటమి ప్రభుత్వం తాలూకా పాలన గా కొనసాగగలిగితే జగన్ కంటున్న మరో ఛాన్స్ కల వై నాట్ 175 వంటి కల గానే మిగిలిపోతుంది.




