కొంతంది టీడీపీ ఎమ్మెల్యే ల అతి, అత్యుత్సహం తెలుగుదేశం పార్టీకే కాదు కూటమి ప్రభుత్వానికి కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ప్రత్యర్థి వైసీపీ పార్టీ కి అస్త్రాలను అందిస్తున్నాయి. దీనితో వీరి చర్యలతో పార్టీ అధిష్టానం సైతం సీరియస్ అవ్వక తప్పలేదు.
ముందుగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వివాదం అటు సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంటే ఇటు వైసీపీ లో మంచి జోష్ నింపింది. సదరు ఎమ్మెల్యే నటుడు జూ. ఎన్టీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు జూనియర్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాయేలా చేసాయి.
మా అభిమాన నటుడి పై దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన్ను టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ తారక్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగుందని, అవి తానూ చేసిన వ్యాఖ్యలు కాదంటూనే సదరు ఎమ్మెల్యే తారక్ అభిమానులకు క్షమాపణ చెప్పారు.
ఇక అందివచ్చిన అవకాశాన్ని వైసీపీ ఊరికే ఊరుకుంటుందా.? నారా, నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు అన్నట్టుగా, చిన్న ఎన్టీఆర్ ని చూసి పెద బాబు, చిన బాబు భయపడుతున్నారా.? అంటూ వైసీపీ, టీడీపీ పై తనదైన రాజకీయం మొదలుపెట్టింది.
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే వివాదం ఇలా ఉంటే, ఇక శ్రీకాకుళం ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే మరో వివాదంతో పసుపు జెండాకు అస్లీల మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఓ మహిళా వివాదంలో ఇరుక్కున్నారు.
పొద్దుటూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ తన పై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, కేజీబీవీ లో జరుగుతున్న అవినీతి పై ప్రశ్నించినందుకే తన పై ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, తానూ కేవలం తల్లికి వందనం పథకం పై చర్చించేందుకే ముగ్గురు ప్రినిసిపాల్స్ తో వీడియో కాల్ మాట్లాడనంటూ కూన తనపై వస్తున్న మహిళా వివాదం అంశం పై వివరణ ఇచ్చారు.
ఇక మరికొంతమంది పార్టీలో గ్రూపులుగా విడిపోయి గ్రోపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఈ విధంగా టీడీపీ ఎమ్మెల్యే లు అనవసరమైన అంశాలలో తల దూర్చి తమ వ్యక్తిగత జీవితానికి, రాజకీయ భవిష్యత్ కి వారే అడ్డంకులు సృష్టించుకుంటూ, టీడీపీ పార్టీకి బాబు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు.
అయితే గతంలో కూడా ఇదే మాదిరి మహిళా వివాదంలో చికుక్కున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో కూడా పార్టీ అధిష్టానం సీరియస్ అవడం ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం చెకచెక జరిగిపోయింది. ఇక తొలిసారి టీడీపీ ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చిన కొలికిపూడి సైతం పార్టీని ఇబ్బందులలో నెట్టారు.
ఇటువంటి వారందరిని కట్టడి చేయగలిగిన పార్టీ అధిష్టానం ఇక పై కూడా పార్టీకి, ప్రభుత్వానికి అపకీర్తిని తెచ్చిపెట్టే నాయకుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి బాబు పార్టీ నేతలకు కీలక హెచ్చరికలు పంపారు. అలాగే వైసీపీ దుష్ప్రచారాలను సైతం బలంగా తిప్పికొట్టాలంటూ పార్టీ నేతలను ఆదేశించారు.






