అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్-2 సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు జూ.ఎన్టీఆర్ అభిమానులకు ఆగహ్రం కలిగించడంతో వారు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని వారిని లోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దగ్గుబాటి ప్రసాద్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కానీ అయన లోపల లేరని పోలీసులు నచ్చజెప్పి పంపించేశారు. జూ.ఎన్టీఆర్ అభిమానులు కార్యాలయం బయట ఉన్న ఆయన ఫ్లెక్సీ బ్యానర్ని చించేశారు.
ఈ పరిణామాలపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందిస్తూ, “గత 7-8 నెలలుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారు. ఈ విషయం మా అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్ళి వారిపై చర్యలు తీసుకోవాలని కోరాను.
నాకు చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. అయన సినిమాలంటే చాలా ఇష్టం. అలాగే జూ.ఎన్టీఆర్… అయన సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. ఇంత అభిమానం ఉన్న నేను జూ.ఎన్టీఆర్ గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుతాను?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోతో దానిలో చెప్పిన మాటలతో నాకు ఎటువంటి సంబందమూ లేదు. నా రాజకీయ శత్రువులు నన్ను నేరుగా ఎదుర్కోలేక ఈవిదంగా మార్ఫింగ్ చేసిన వీడియోని సర్క్యూలేట్ చేస్తున్నారు.
నేను ఎటువంటి తప్పు చేయలేదు. జూ.ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదు. అయినప్పటికీ ఈ పరిణామాల వలన జూ.ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకున్నారు కనుక వారందరికీ నేను క్షమాపణ చెపుతున్నాను. ఈ నకిలీ వీడియోపై దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయవలసిందిగా జిల్లా ఎస్పీకి ఇప్పిపుడే ర్యాదు చేశాను,” అని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు.






