నాడు వైసీపీ, నేడు టీడీపి ఎమ్మెల్యేలు… సేమ్‌ టూ సేమ్‌?

TDP MLAs Public Connect

నాడు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేస్తానని, మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్ళి వాటి గురించి ప్రజలకు వివరించి ప్రజలకు దగ్గరవ్వాలని పదేపదే చెప్పేవారు.

తద్వారా ప్రజల అభిమానం చురగొంటే ఎన్నికలలో సులువుగా గెలవగలరని జగన్‌ హితవు చెప్పేవారు. కానీ చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి చూపేవారు కారు. గడప గడపకి కార్యక్రమంలో పాల్గోనబోతే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వనని జగన్‌ హెచ్చరించినా చాలా మంది పట్టించుకోలేదు.

ADVERTISEMENT

చివరికి జగన్‌ భయపడినట్లే ఎన్నికలలో వైసీపీ ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. ఇప్పుడు పార్టీలో అందరూ జగన్‌ పిలుపు ఈయగానే పొలోమని ప్రజల మధ్యకు వచ్చేసి హడావుడి చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే కదా?

నాడు జగన్‌ ఎదుర్కొన్న సమస్యే ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఎదుర్కొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 48 మంది హైదరాబాద్‌ లేదా బెంగళూరులో ఆస్తులు, వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని, ప్రతీ మంత్రి, ఎమ్మెల్యే పించన్లు, సంక్షేమ పధకాల సొమ్ము పంపిణీ కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా పాల్గొనకపోతే, ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వారి జాబితా తయారుచేసి తనకు పంపించాలని ఆదేశించారు.

సిఎం చంద్రబాబు నాయుడు ప్రతీ నెల మొదటి వారంలో తప్పనిసరిగా రాష్ట్రంలో ఏదో ఓ జిల్లా, పట్టణం లేదా గ్రామంలో పర్యటిస్తూ ప్రజల యోగ క్షేమాలు తెలుసుకొని వారికి స్వయంగా పించన్, సంక్షేమ పధకాల సొమ్ము అందజేస్తున్నారు. కనుక ఆయన స్పూర్తితో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజల మధ్యకు వెళ్ళి అదేవిదంగా చేసి ప్రజాధరణ పొందవచ్చు. కానీ ఒళ్ళు వంగడం లేదు.. అని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతున్నారు కదా?

ADVERTISEMENT
Latest Stories