మాజీ ముఖ్యమంత్రి సతీమణి వైస్ భారతి రెడ్డి మీద టీడీపీ కార్యకర్త కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత టీడీపీ..పార్టీ పరంగా తీసుకున్న చర్యలు, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొంతమంది టీడీపీ మద్దతుదారులకు తీవ్ర ఆగ్రహానికి గురి చేసాయి.
వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం లేకుండా మహిళలు అనే సంస్కార మరచి, రాజకీయ విలువలు గాలికొదిలేసి బాబు కుటుంబంలోని మహిళలను వైసీపీ నాయకుల నుంచి ఆ పార్టీ కార్యకర్తలుగా చెప్పుకొనే వారి వరకు ఎంత గోరంగా అవమానించి అవహేళన చేసారో ఇప్పటి టీడీపీ శ్రేణులు మర్చిపోలేకపోతున్నారు.
ఆనాడు వారి ఆవేశానికి ‘ఓర్పు’ అనే ‘ముసుగు’ తొడిగిన టీడీపీ, ఈనాడు అదే ఆవేశానికి ‘బాధ్యత’ అనే ‘తాళం’ వేస్తున్నారు అంటూ కొంతమంది టీడీపీ తమ్ముళ్లు వారి పార్టీ అధిష్టాన నిర్ణయాల పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు నిండు సభలో 151 మంది వైసీపీ సభ్యులు, 23 మంది టీడీపీ నేతల మధ్యన నారా భువనేశ్వరి ని తన భర్త చంద్రబాబు సాక్షిగా గోరంగా అవమానించారు వైసీపీ నేతలు.
ఎన్టీ రామారావు కుమార్తె, నందమూరి ఆడపడుచు, నారా వారి కోడలు ఇలా తనచుట్టూ బలమైన కవచం ఉన్నప్పటికీ కేవలం అధికార మదంతో వైసీపీ నీచులు అంతటి దుస్సాహసానికి పాల్పడ్డారు. దీనితో అటు జూ. ఎన్టీఆర్ నుంచి ఇటు బాలకృష్ణ వరకు నందమూరి వారసత్వం మొత్తం ఏకతాటి మీదకొచ్చి వైసీపీ నాయకుల దుస్సాహసాన్ని ముక్త కంఠంతో ఖండించారు.
అయినా కూడా వైస్ జగన్ కించిత్తైన విలువలు పాటించకుండా, భువనేశ్వరి పై ఈ తరహా వ్యాఖ్యాలు చేసిన వారి పై ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. అలాగే బోరుగడ్డ, వంశీ, కొడాలి నాని, రోజా, జోగి రమేష్, శ్రీ రెడ్డి, పోసాని వంటి వైసీపీ ఉన్మాదుల చేత గత ఐదేళ్లు టీడీపీ కార్యకర్తల చెవులలో రక్తం వచ్చేలా బాబు పై ఆయన కుటుంబం పై నీచమైన రాజకీయం చేసారు జగన్.
అటువంటి పార్టీ నేతల కోసం, ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన కార్యకర్తలకు ఇటువంటి శిక్షలా.? వైసీపీ నేతలు చేస్తే తప్పు కానిది, చర్యలు లేనిది….టీడీపీ శ్రేణులకు ఎందుకు.? అంటూ కొంతమంది టీడీపీ సానుభూతిపరులు కిరణ్ అరెస్టు పై ఆయనను మీడియాకు చూపించిన విధానం పై మండిపడుతున్నారు.
గత ఐదేళ్లు బాబు, లోకేష్ పై రెచ్చిపోయి చివరికి జగన్ ఒకే అంటే ఐదు నిముషాలలో బాబు ని లేపేస్తా అంటూ హద్దులు దాటిన బోరుగడ్డ కు సైతం జైల్లో విందులు, వినోదాలతో సకల మర్యాదలా.? కర్రలతో బాబు ఇంటి పైకెళ్ళి దాడికి యత్నించిన జోగి లాంటి వారికి సైతం టీడీపీ నాయకులతో స్నేహ బంధాలా.? కొడాలి నాని విషయంలో లేని దుందుడుకు చర్యలు, శ్రీ రెడ్డి విషయంలో చూపిన క్షమా గుణం పార్టీకోసం పని చేసే వారి పైన లేదా.? అంటూ ప్రభుత్వ నిర్ణయం పై కొంతమంది టీడీపీ అభిమానులు అలక పూనారు.
ప్రత్యర్థి పార్టీ నేతల గత పాపాల మీద లేని మీ ఆవేశం, పార్టీ గెలుపు కోసం, పచ్చ జెండా భుజాన మోసిన వాడిపైనా మీ ప్రతాపం అంటూ సోషల్ మీడియాలో టీడీపీ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ తెలుగుతమ్ములు అలకపాన్పు ఎక్కారు. అయితే వారి అలక, ఆవేశం ధర్మగ్రహమేనా.? అంటే ఒక్కో కోణంలో అది వాస్తవమే అయినప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా బాబు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా హర్షణీయమనే చెప్పాలి.
తన వ్యక్తిగత ద్వేషం నో, తన పార్టీ క్యాడర్ మానసిక సంతోషాల కోసమో రాజకీయాలలో విలువలను మరిచిపోలేదు బాబు. అవతలి వాడు గడ్డి తిన్నాడు కదా అని అదే గడ్డి మనం తింటే ఎలా అన్న సామెత మాదిరి వాళ్ళు హద్దు దాటారు కదా అని వీళ్ళు హద్దు దాటితే ఎలా.? అన్న సిద్ధాంతం టోన్ బాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితం గడిచింది. బాబు అలా లేకుంటే నాడు వైసీపీ కి పట్టిన గతే రేపు టీడీపీ కి తప్పదు అనే వాస్తవాన్ని టీడీపీ శ్రేణులు బలంగా నమ్మాలి.
క్షణికావేషాలు, తాత్కాలిక ఆనందాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇవ్వలేవు అనేది టీడీపీ తమ్ముళ్లు గ్రహించాలి. వారి ఆవేశం సహేతుకమే అయినప్పటికీ అది ఆచారం సాధ్యం కాదనేది గుర్తించాలి. అటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా వారి పై కఠిన శిక్షలు వేయనిదే సమాజంలో మహిళలకు సరైన గౌరవం, భద్రతా దక్కని పరిస్థితి ఏర్పడుతుంది.




