ఈ వారం ఓటీటీలలో ఏం సినిమాలు వస్తాయి? ఈ నెల థియేటర్లలో ఏ కొత్త సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి? ఈ నెల్లో ఏ మ్యాచ్ జరుగబోతోంది?వంటి వార్తలు రోజూ చూస్తూనే ఉంటాము.
అయితే ఏపీ ప్రభుత్వం ఈ ఆగస్ట్ నెలలోనే మూడు పధకాలు అమలు చేయబోతోంది. ఇవన్నీ జగన్, వైసీపీ నేతల పాలిట హర్రర్ సినిమాల వంటివే అని చెప్పక తప్పదు. ఎందుకంటే, నెలకు మూడేసి హామీలు అమలు చేసేస్తుంటే ఇక మేము దేని కోసం పోరాడాలి ఎవరితో పోరాడాలి?అని లోలోన బాధపడకుండా ఉండరు కదా?
విషయానికి వస్తే, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ వాగ్దానాలలో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, మరమగ్గం కార్మికులకు ఉచిత విద్యుత్ పధకం అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
చేనేత మగ్గాలకు నెలకు 250 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ వాడుకోవచ్చు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 125 కోట్లు భారం పడుతుంది. కానీ దీని వలన రాష్ట్రంలో 50,000 చేనేత కార్మికులకు, 15,000 మరమగ్గాల కార్మికులకు లబ్ది కలుగుతుంది. ఈ మేరకు వారిపై విద్యుత్ చార్జీల భారం తగ్గుతుంది. ఇది వారికి చాలా సంతోషం కలిగించే వార్తే కదా?
సూపర్ సిక్స్ హామీలలో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పధకానని రేపు ఆగస్ట్ 2 నుంచి అమలు చేయబోతున్నారు.
రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించబడిన ఈ ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా రాష్ట్రంలో 6.50 లక్షల మంది రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికీ రూ 7,000 చొప్పున డబ్బు జమా చేయబోతోంది.
దీనిలో పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2,000, అన్నదాత సుఖీభవ’ పధకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 కలిపి మొత్తం రూ. 7000 చొప్పున జమా చేయబోతోంది.
ఆగస్ట్ 2న మొదటి విడతలో రూ. 7000, రెండో విడతలో మరో రూ.7000, మూడో విడతలో రూ.6,000 కలిపి ఏడాదికి మూడు విడతలలో మొత్తం 20,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించబోతున్నాయి.
ఈ నెల 15 నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఒక్క ఆగస్ట్ నెలలోనే సూపర్ సిక్స్లోని మూడు హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోతోందన్న మాట!
ఓ పక్క అమరావతి, పోలవరం నిర్మిస్తూ, మరోపక్క రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పిస్తూ, మరోపక్క ఇలా నెలకు రెండు మూడేసి హామీలు అమలుచేస్తామంటే మేమెలా బతకాలి బాబూ?అని వైసీపీ వాళ్ళు బాధపడకుండా ఉంటారా?






