భారత క్రికెట్ చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప క్రికెటర్లు ఉన్నారు. తొలిసారి ‘వరల్డ్ కప్’ అందించిన కపిల్ దేవ్ మొదలు మళ్ళీ ‘వరల్డ్ కప్’ అందించిన మహేంద్ర సింగ్ ధోని వరకు, ఎవరి స్థాయిలో వారు మేటి క్రికెటర్లుగా అవతరించారు. అయితే వ్యక్తిగతంగా సచిన్ శకం ప్రపంచ క్రికెట్ ను ఎలా ప్రభావితం చేసిందో… జట్టు పరంగా కోహ్లి శకం భారత క్రికెట్లో నూతన అధ్యాయాన్ని లిఖించబోతుందన్న సంకేతాలు కనపడుతున్నాయి.
‘హ్యాట్రిక్ సిరీస్’ లక్ష్యంగా కరీబియన్ గడ్డపై కాలు మోపిన కోహ్లీ సేన తొలి టెస్టులోనే 63 ఏళ్ళ భారత క్రికెట్ చరిత్రను తిరగరాసింది. అంటిగ్వాలో ముగిసిన తొలి టెస్టును టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో చేజిక్కించుకుని, నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. 63 ఏళ్లుగా విండీస్ లో పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటిదాకా ఇన్నింగ్స్ తేడాతో కరిబీయన్ జట్టుపై విజయం సాధించింది లేకపోవడం విశేషం. భారత జట్టు తరఫున హేమాహేమీలు వెళ్లినా సాధ్యం కాని రికార్డు విజయాన్ని కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సాధించాడు.
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ… తన కెరీర్ లోనే డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, స్పిన్నర్ గా బరిలోకి దిగిన రవిచంద్రన్ అశ్విన్ కూడా తన కెరీర్ లోనే తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండిస్ జట్టును భారత బౌలర్లు తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి ఫాలో ఆన్ లో పడేశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండిస్ బ్యాటింగ్ ఆర్డర్ ను 231 పరుగులకే అశ్విన్ 7 వికెట్లతో కుప్పకూల్చాడు. ఆల్ రౌండ్ ప్రతిభతో టీమిండియా ఘన విజయానికి బాటలు వేసిన అశ్విన్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.



