ఇది వరకు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ‘పశువుల దాణా కుంభకోణం’ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తెలంగాణలో కూడా అటువంటి కుంభకోణం జరిగింది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో తెలంగాణలోని యాదవులు, గొల్ల కురుములకు జీవనోపాధి కోసం అంటూ ఒక్కొక్కరికీ 20 గొర్రెలు చొప్పున కొనుగోలు చేసి ఇచ్చారు. కానీ ఆనాడే దానిలో భారీగా అవినీతి జరుగుతోందని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ ఆరోపణలపై స్పందించిన తెలంగాణ ఏసీబీ గొర్రెల కొనుగోలు-పంపిణీ వ్యవహారంపై విచారణ జరిపి రూ. 700 కోట్లు అవినీతి జరిగిందని తేల్చి కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా ఈడీ కూడా మరో కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది.
తెలంగాణ పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ఇంకా ఆ శాఖలోని పలువురు అధికారుల నివాసాలు, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, బంధు మిత్రుల ఇళ్ళలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు.
నాడు తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండేవారు. కనుక ఈ కేసులో తదుపరి విచారణ ఆయన వంతే కావచ్చు.
తెలంగాణలో గొర్రెల కేసు గురించి ఎందుకీ చర్చ?అని అనుకోవచ్చు. కానీ కేసీఆర్ హయంలో తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి జరిగిపోతోందని, అనేక పధకాలు హామీ అవుతున్నాయని, కానీ జగన్ 5 ఏళ్ళ పాలనలో ఏపీలో అప్పులు, అరాచకం తప్ప మరొకటి లేవని ఏపీ ప్రజలు బాధపడుతుండేవారు.
అక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం నిర్మాణం పేరుతో రూ.20-30 వేల కోట్లు, గొర్రెల పంపిణీ పధకంతో మరో రూ. 700 కోట్లు అవినీతికి పాల్పడితే, ఇక్కడ జగన్ చాలా తెలివిగా మద్యం కుంభకోణం ప్లాన్ చేసి పకాడ్బందీగా అమలుచేసి సుమారు 3,500 కోట్లు కొట్టేశారని ఈ కేసులే చెపుతున్నాయి. అంటే గొర్రెలైనా, మద్యం అయినా అవినీతి కామన్ అన్నమాట! ఎవరికి తోచిన పద్దతిలో వారు దోచేసుకుంటూనే ఉన్నా ప్రజలు వారిని ఆరాధించడం మానకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.






