రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్న గణాంకాల జాబితా ఇది. ఓ పక్కన ప్రైవేటు విద్య మధ్య, దిగువ తరగతి ప్రజలకు భారం అవుతుంటే… మరో పక్కన ప్రభుత్వ పాఠశాలలు మాత్రం మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొనడం శోచనీయం. వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి లోక్ సభలో పాఠశాలల మూసివేతపై వేసిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఉపేంద్ర కుశాహ్వ ఇచ్చిన జవాబు ఇది.
2011 నుంచి తెలంగాణలో 2,510 పాఠశాలలు మూతపడ్డాయని, గడచిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో 879 పాఠశాలలు మూతపడ్డాయని కుశాహ్వ లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు. ఈ గణాంకాలు స్వయంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించినవేనని పేర్కొన్నారు. స్కూళ్లలో చేరుతున్న పిల్లల ఆధారంగా వాటిని హేతుబద్ధీకరించడం వల్లనే పాఠశాలలు మూతబడ్డాయని తెలిపారు. అయితే, విద్యార్థులకు నష్టం కలుగకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని వెల్లడించారు.



