ప్రభుత్వం బలహీనంగా ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఆకర్షించి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడం ఎంత గొప్పగా ఉంటుందో, అదే…వారు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సివస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది.
ఇందుకు తాజా ఉదాహరణగా తెలంగాణలో కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ వారిని సంజాయిషీ కోరుతూ నోటీసులు ఇచ్చారు. వారు జవాబులు ఇచ్చారు. కనుక ఇప్పుడు బంతి స్పీకర్, సిఎం కోర్టులో ఉంది.
కానీ 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తిరిగి గెలిపించుకోవడం అంత వీజీ కాదు. ఎందుకంటే తెలంగాణలో యూరియా కొరత సమస్యని బీఆర్ఎస్ పార్టీ బాగా హైలట్ చేసి రాజకీయంగా అనుకూలంగా మలుచుకుంది. అలాగని బీఆర్ఎస్ పార్టీ ఆ 10 స్థానాలలో ఖచ్చితంగా గెలుస్తుందనే గ్యారెంటీ కూడా లేదు. ఈ ఉప ఎన్నికలలో కూడా ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ ఇక కోలుకోవడం చాలా కష్టమే.
బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్ద మూడు అస్త్రాలున్నాయి. 1. బీసీ రిజర్వేషన్స్, 2. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, 3. ఎఫ్-1 రేసింగ్ కేసు.
కనుక ఈ రెండు కేసులలో కదలికలు వచ్చేలా చేయగలిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద బీసీ రిజర్వేషన్స్ అస్త్రం కూడా ప్రయోగించి పది మందిలో కనీసం 5-6 గురినైనా గెలిపించుకోగలదు. ఈవిషయం కూడా కేసీఆర్, కేటీఆర్లకు కూడా బాగా తెలుసు.
ఈ ఉప ఎన్నికలు రెండు పార్టీలకు అగ్నిపరీక్ష వంటివే కనుక హడావుడిగా వాటిని తెచ్చి నెత్తిన పెట్టుకోకుండా పరస్పర విమర్శలతో కాలక్షేపం చేయక తప్పదు. కేటీఆర్ నిన్న గద్వాల్ పట్టణంలో పర్యటించినప్పుడు మరో 6-9 నెలల్లో ఈ ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పడమే ఇందుకు నిదర్శనం.





