తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉంటుందా?ఉంటే ఏ మేరకు, ఏవిదంగా ఉండబోతోందని ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. తెలంగాణ శాసనసభలో మొత్తం 119 సీట్లు ఉండగా వాటిలో 115 సీట్లకు సిఎం కేసీఆర్ నిన్న అభ్యర్ధులను ప్రకటించేశారు. వారిలో ఏడుగురు తప్ప మిగిలినవారందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. తన ఎమ్మెల్యేలపై కేసీఆర్కి ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది ఇది. అదేవిదంగా కేసీఆర్ టీమ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర నిర్వహించారు.
మరి ఏపీలో సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా తన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్ళగలరా? అంటే కాదనే చెపొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమితో ఒకేసారి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటువేసి బయటకు పంపించేశారు.
ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, రామచంద్రాపురం నియోజకవర్గంలో సీనియర్ వైసీపీ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టికెట్ కోసం పార్టీ వీడేందుకు సిద్దపడగా వారిద్దరినీ జగన్ స్వయంగా బుజ్జగించి శాంతింపజేశారు.
గన్నవరంలో టిడిపి నుంచి వచ్చిన వల్లభనేని వంశీ కోసం వైసీపీని అంటిపెట్టుకొని ఉన్న యార్లగడ్డ వెంకటరావుని వదులుకొన్నారు. ఐప్యాక్ నివేదికలలో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పనితీరు బాగోలేదని చెపితే, జగన్ సొంత సర్వేలతో ఆ సంఖ్యని 18కి తగ్గించుకొని సంతృప్తిపడ్డారు. కనుక ఎంతమంది ఎమ్మెల్యేలపై జగన్కు నమ్మకం ఉంది?వారిలో ఎంతమందికి ఆయనపై నమ్మకం ఉంది?చివరికి ఎంతమందికి టికెట్లు లభిస్తాయనేది ప్రశ్నార్ధకంగానే కనిపిస్తోంది.
ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే, ఇక ఆయనను ఎవరూ ఆపలేరు. అప్పుడు ఆయన తప్పకుండా ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్ధులను బరిలో దించుతారు.
ఏపీలో బిఆర్ఎస్ గెలిచినా గెలవకపోయినా ఓట్లు చీల్చగలదు. కనుక వైసీపీ, టిడిపి, జనసేన మూడు పార్టీలు కూడా తీవ్రంగా నష్టపోవచ్చు. ఆ కారణంగా ఏపీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే ఏపీలో రాజకీయాలు మరింత నీచంగా మారడం ఖాయం.
ఒకవేళ తెలంగాణ ఎన్నికలలో బిజెపి గెలిస్తే ఆ ప్రభావం ఏపీ బిజెపిపై తప్పక ఉంటుంది. అప్పుడు జనసేనతో కలిసి బిజెపి చెలరేగిపోవడం ఖాయమే.
ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగితే దాని తదుపరి లక్ష్యం పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అవుతుంది. ఎందుకంటే జాతీయస్థాయిలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అది వీలైనన్ని ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. ఏపీలో 25 సీట్లు ఉన్నందున, వైఎస్ షర్మిలని బరిలో దింపి వాటిని కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా ప్రయత్నించవచ్చు. కనుక తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రభావం ఏపీ ఎన్నికలపై తప్పకుండా ఉంటుంది.



