కేసీఆర్‌కి మాత్రమే గౌరవం, హక్కులు ఉంటాయా? గవర్నర్‌ ప్రశ్న

 Telangana Governor Tamilisai Soundararajan Questions kCRతెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై సిఎం కేసీఆర్‌కు ఆగ్రహం కలిగినందున తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి అధికారులు కూడా ఆమెతో అదేవిదంగా ప్రవర్తిస్తున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా ఆమెపై అనుచిత విమర్శలు కూడా చేస్తున్నారు.

గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రతినిధి కనుక గవర్నర్‌తో విబేదించడం అంటే కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడంగానే భావించవచ్చు. ఇదివరకు కేంద్రంతో కేసీఆర్‌ సఖ్యతగా ఉన్నప్పుడు గవర్నర్‌ నర్సింహన్‌తో చాలా హుందాగా, సఖ్యతగా వ్యవహరించారు. ఇప్పుడు కేంద్రంపై కత్తులు దూస్తున్నారు కనుక గవర్నర్‌ని కూడా శత్రువుగా భావిస్తున్నట్లున్నారు. అందుకే గవర్నర్‌ తమిళిసై పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారనుకోవచ్చు.

ADVERTISEMENT

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని నిర్వీర్యం చేయడం ఎంత తప్పిదమో ఇప్పుడు గ్రహించినట్లే గవర్నర్‌ని శత్రువుగా మార్చుకోవడం కూడా అంతే ప్రమాదకరమైనదని ఏదో రోజు తెలుసుకోవచ్చు.

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై మూడేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంగా శుక్రవారం రాజ్ భవన్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. దానిలో ఆమె విలేఖరుల ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ తెలంగాణ సిఎం కేసీఆర్‌ వైఖరి, తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆమె నిప్పులు చెరిగారు.

కేసీఆర్‌ సూచించిన వ్యక్తిని తాను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోవడం వలననే ఆయన తనపై ద్వేషం పెంచుకొన్నారని అన్నారు. అయితే గవర్నర్‌ విచక్షణాధికారంతో జరిగే ఆ నియమకంలో కేసీఆర్‌ తనను ఎలా ఆజ్ఞాపించగలరని తమిళిసై ప్రశ్నించారు. నేను ఆ వ్యక్తి పేరును తిరస్కరించినప్పుడు, ఆ పదవికి తగిన వేరే వ్యక్తిని ఎందుకు సూచించలేదు?అని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్‌ చెప్పినట్లు వింటేనే గవర్నర్‌కు గౌరవం ఇస్తారా? ప్రోటోకాల్ పాటిస్తారా? లేకుంటే నన్ను, నా పదవిని గౌరవించరా?ఇదేం సంస్కారం? అని ఆమె ప్రశ్నించారు.

మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలకు అందుబాటులో ఉండరు. కానీ నేను అందుబాటులో ఉంటాను. కనుకనే ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు. ప్రజాప్రతినిధులమని గొప్పగా చెప్పుకొనే మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. కానీ రాష్ట్ర ప్రదమ మహిళనైన నేను ఎవరితోనూ మాట్లాడకూడదా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామనుకొంటున్నారా లేదా?అని గవర్నర్‌ ప్రశ్నించారు.

ప్రోటోకాల్ ప్రకారం మీరు నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించరు. కనీసం నేను రాజ్ భవన్‌లో నిర్వహించే జెండా వందనం వంటి అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరుకారు? ఇది మన దేశ గౌరవానికి సంబందించిన విషయమే తప్ప నా సొంత ప్రచార కార్యక్రమం కాదు కదా?రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని మీరు (కేసీఆర్‌) భావిస్తున్నారా లేదా?అని గవర్నర్‌ ప్రశ్నించారు.

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మాట్లాడేహక్కు సామాన్య ప్రజలకు కూడా ఉంటుంది. కానీ నాకు ఉండదా? రాష్ట్ర ప్రధమ మహిళ, గవర్నర్‌ అనే గౌరవం లేకుండా అనుచితంగా మాట్లాడుతూ మళ్ళీ నన్ను తప్పు పట్టడం పరిపాటిగా మారిపోయింది. మీకు మాత్రమే గౌరవం, మాట్లాడే హక్కు ఉంటుంది మరెవరికీ ఉండదనుకొంటున్నారా?అని గవర్నర్‌ తమిళిసై కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.

ఈ మూడేళ్ళలో కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి చాలా అవమానాలు, అవహేళనలు భరించానని, అయినా ఏనాడూ తన పరిధి దాటి వ్యవహరించలేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT
Latest Stories