‘హరితహారం’ కార్యక్రమానికి తనను ఆహ్వానించి సరైన ఏర్పాట్లు చేయని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. మెదక్ జిల్లా కల్హేర్ మండలం, సిర్గాపూర్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హరీష్ రావు, రాపర్తికి వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో నల్లవాగు గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపాల్ మెవాబాయి, విద్యార్థులు మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని ఆపి, తమ పాఠశాల హరితహారంలో పాల్గొనాలని, మొక్కలు నాటాలని కోరారు.
విద్యార్ధుల అభ్యర్ధనను అంగీకరించిన హరీష్, స్కూల్ లోనికి వెళ్లగా, అక్కడ కనీసం పలుగు, పార కాదు కదా… చుక్క నీరు కూడా అందుబాటులో లేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో మండిపడిన హరీష్, తానేమైనా బకరా మంత్రిని అనుకుంటున్నావా? ఇవేనా ఏర్పాట్లు? తనను సరదాకి పిలుద్దామని రోడ్డెక్కారా? అంటూ స్కూల్ ప్రిన్సిపాల్ పై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో మెవాబాయి కొంత మనస్తాపంతో, తప్పు జరిగిందని చెబుతూ, మొక్కలు నాటాలని కోరడంతో, హరీశ్ స్వయంగా గుంత తీసి మొక్కను నాటారు.



