మే 1 నుండి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్ మూతపడనున్నాయా అంటే… డిస్ట్రిబ్యూటర్లు పర్సంటేజ్ పద్ధతికి ఒప్పుకోకపోతే, నష్టాలతో రెంటల్ పద్ధతిలో థియేటర్లను నడిపించడం కంటే పూర్తిగా మూసేయడమే బెటర్ అంటున్నారు ఎగ్జిబిటర్లు.
ఎందుకంత కఠినమైన నిర్ణయం అని ప్రశ్నించగా.. వారి బాధ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఆయన పేరు మెన్షన్ చేయకపోయినా.. ఆయన ఎగ్జిబిటర్ల కష్టాల గురించి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
“అసలు థియేటర్లు మూతపడిపోయే స్టేజ్ లో దిల్ రాజు, సురేష్ బాబులు లీజు వ్యవస్థను ఏర్పాటు చేసి సింగిల్ స్క్రీన్స్ ని కాపాడారు. దాదాపు 20 ఏళ్లు సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ని వాళ్లు పెంచి పోషించారు. రెంట్స్ కూడా వాళ్లు ఎగ్జిబిటర్లను దృష్టిలో పెట్టుకుని మంచి ఎమౌంట్ ఇప్పించేవారు. అందువల్ల థియేటర్ ఓనర్లు కూడా సంతోషంగా ఉండేవారు.
ఇప్పుడు మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చాక, ఉదాహరణకి 5 లక్షలు వచ్చే రెంట్ ను 2 లక్షలకి కుదించి, నిర్మాతలకు ఎక్కువ డబ్బులు మిగులుస్తామని చెప్పి, సింగిల్ స్క్రీన్ వ్యవస్థను అణిచివేస్తూ, థియేటర్ ఓనర్లకు అన్యాయం చేస్తున్నారు.
కోవిడ్ తర్వాత సినిమాలని ప్రేక్షకులు చూసే విధానం మారిపోయింది. రెండోవారం కూడా సినిమా చూడ్డానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. 70% మంది మొదటి రోజు సినిమా చూడాలి అనుకుంటే, 90% మంది మొదటి వారాంతంలో సినిమా చూడాలనుకుంటున్నారు. అందుకు “దురంధర్ 2” బెస్ట్ ఎగ్జాంపుల్. మొదటివారం సింగిల్ స్క్రీన్స్ లో 80 లక్షలు వసూలు చేసిన ఆ చిత్రం, సెకండ్ వీక్ కి 20 లక్షలు మాత్రమే వసూలు చేసింది.
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే తప్ప రెండోవారంలో జనాలు సినిమాను థియేటర్లలో చూడడం లేదు అనేందుకు ఇంతకిమించిన ఉదాహరణ ఏం కావాలి. ఇలాంటి పరిస్థితిలో ఎగ్జిబిటర్ లేదా థియేటర్ ఓనర్ ఎలా సర్వైవ్ అవ్వాలి?. అయినా మల్టీప్లెక్స్ సంస్థలతో మొదటి వారం 55%, రెండోవారం 45%, మూడోవారం 35% షేరింగ్ కి సమ్మతించిన డిస్ట్రిబ్యూటర్లకి, సింగిల్ స్క్రీన్స్ లో అదే పద్ధతి ఫాలో అవ్వడానికి ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదు.
ఇలా రెంటల్ పద్ధతిలో ఉన్న సింగిల్ స్క్రీన్స్ అన్నీ మూసుకుపోతే.. సగటు మధ్యతరగతి ప్రేక్షకుడు సినిమాకి దూరమవుతాడు అనే విషయాన్ని నిర్మాతలు సీరియస్ గా పట్టించుకోకపోవడం మాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ నిర్మాతలు లేదా గిల్డ్ గనుక పర్సంటేజ్ పద్ధతికి అంగీకరించకపోతే.. థియేటర్లు మూసుకుంటాం కానీ, ఈ లాస్ బిజినెస్ లో మాత్రం పొరపాటున కూడా కొనసాగం. ఇప్పుడు తెలంగాణలో మొదలైన ఈ తిరుగుబాటు, త్వరలో ఆంధ్రాలోనూ మొదలవ్వనుంది” అని చెప్పుకొచ్చారు.
మరి ఈ విషయమై మైత్రీ సంస్థ లేదా నిర్మాతల గిల్డ్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.




