రాష్ట్ర ప్రయోజనాలు వేరు… పార్టీల ప్రయోజనాలు వేరు. కానీ పార్టీ ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలుగా మార్చేస్తున్నాయి మన రాజకీయ పార్టీలు.
ఉదాహరణకు బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయాలే ఇందుకు ఓ చక్కటి ఉదాహరణ. దీంతో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ మైలేజ్ లభిస్తోందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే పాట పాడుతుండటం ఇందుకు మరో చక్కని ఉదాహరణ.
ఒకవేళ బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం కలుగుతుందనుకుంటే ఏవిదంగా కలుగుతుందో ఏ మేరకు కలుగుతుందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆ రెండు పార్టీలపై ఉంటుంది.
కానీ ఆ పని చేయకుండా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నీళ్ళని ఎత్తుకుపోతున్నారంటూ పోటాపోటీగా విమర్శలు చేస్తూ ‘తెలంగాణ ప్రజల సెంటిమెంట్’ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏపీ, పంజాబ్ రాష్ట్రాలకు చెరొకటి, ఒడిశాకి రెండు సెమీ కండక్టర్ పరిశ్రమలను మంజూరు చేసింది. బీఆర్ఎస్ పార్టీ దీనిపై కూడా అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టేసింది.
‘కేంద్రం తెలంగాణపట్ల వివక్ష చూపుతోంది. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణకు దక్కాల్సిన ఈ పరిశ్రమని చంద్రబాబు నాయుడు కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి ఏపీకి పట్టుకుపోయారు.
ఏపీకి పరిశ్రమలు తరలించుకు పోయేందుకు రేవంత్ రెడ్డి ఆయనకు అన్ని విధాల సహకరిస్తున్నారు,’ అని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.
కానీ బీఆర్ఎస్ పార్టీకి రెండు సెమీ కండక్టర్ పరిశ్రమలు దక్కించుకున్న ఒడిశా రాష్ట్రం పట్ల ఎటువంటి అభ్యంతరాలు లేవు. పంజాబ్ పట్ల ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఏపీ ఏది లభించినా అది తెలంగాణకు అన్యాయమే అని వితండవాదం చేస్తూ, తెలంగాణ ప్రజలలో సెంటిమెంట్ రాజేసి లబ్ది పొందాలనుకుంటోందన్న మాట!
బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా తిప్పుకొని దూసుకుపోతుంటే, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందనే భయంతో కాంగ్రెస్ మంత్రులు కూడా అభ్యతరం చెపుతున్నారు. కానీ తాము బీఆర్ఎస్ పార్టీకి వంత పాడుతూ దానిలో ఉచ్చులో చిక్కుకున్తున్నామని గ్రహించలేకపోతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరుకి ఆంధ్రప్రదేశ్, సిఎం చంద్రబాబు నాయుడు ‘సాఫ్ట్ టార్గెట్’గా మారుతుండటం చాలా శోచనీయం.






