గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాలు ‘ప్రాంతీయవాదం’ సెంట్రిక్ గా సాగుతున్నాయి, అలాగే ఇటు తమిళనాడు రాజకీయాలు ‘సనాతనవాదం’ కేంద్రంగా ముందుకెళుతున్నాయి. అయితే ఇందులో తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏపీ vs తెలంగాణ అన్నట్టుగా రాజకీయాలు ముందుకెళుతుంటాయి.
ఇక తమిళనాడు విషయానికొస్తే, తమిళనాడులో గత ఐదేళ్లు అధికారంలో ఉన్న డీఎంకే నేత నాటి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇక తాజాగా డీఎంకే ప్రతిపక్షానికి పరిమితం అయినా కూడా స్టాలిన్ సనాతన ధర్మం పై ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు.
రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని నిర్ములించాలని అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత హోదాలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపాయి. ఇక దానికి తోడు అధికార పార్టీ టీవీకే ఎమ్మెల్యే సైతం సనాతన ధర్మం పై అనుచిత వ్యాఖ్యలు చేసారు.
ఈ నేపథ్యంలో సీనియర్ నటి, బీజేపీ మహిళా నేత కుష్భు స్పందిస్తూ రాష్ట్రంలో అధికార – ప్రతిపక్ష పార్టీలు కలిసి సనాతన ధర్మం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ రకమైన వ్యాఖ్యలు ఒక క్రిస్టియన్ మతం పైన కానీ ఒక ముస్లిం మతం పై కానీ చేసేందుకు సాహసించగలారా అంటూ తన X వేదికగా పోస్ట్ చేసారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ – ప్రతిపక్ష బిఆర్ఎస్ ప్రాంతీయవాదం కేంద్రంగా రాజకీయాలు నడుపుతాయి, తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ ఆగినా, ఆంధ్రాలో ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కినా తెలంగాణ రాజకీయ నేతలు ఏపీ కేంద్రంగా రాజకీయం చేస్తారు. అదే నిజమని తమ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు.
ఏపీలో పోలవరం నిర్మించినా, గోదావరి మిగులు జలాల కోసం బనకచర్ల మొదలు పెట్టినా, బనకచర్ల స్థానంలో నల్లమల్ల సాగర్ అంటూ ప్రకటించినా అది తెలంగాణ ప్రజలకు ఏపీ చేస్తున్న ద్రోహం అనేలా అక్కడి ప్రతిపక్ష బిఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ వరకు ప్రాంతీయవాద రాజకీయం చేస్తుంటారు.
అలాగే ఇటు తమిళనాడు బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి అధికార టీవీకే – ప్రతిపక్ష డీఎంకే సనాతన ధర్మం మీద విషం చిమ్ముతూ మత రాజకీయాలను పెంచి పోషిస్తున్నాయి.ఈ ప్రాంతీయవాద రాజకీయాలతో, మత రాజకీయాలతో ఆయా రాష్ట్ర రాజకీయ పార్టీలు కొంతకాలం రాజకీయ లబ్దిని పొందవచ్చు కానీ అది శాశ్వతం కాదు అనేది నేటి బిఆర్ఎస్ పరిస్థితి, డీఎంకే దుస్థితి చూస్తే యిట్టె అర్ధమవుతుంది.






