రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ తమ తమ రాష్ట్రాల అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.
కేసీఆర్కు వడ్డించిన విస్తరి వంటి హైదరాబాద్ చేతికి రాగా, చంద్రబాబు నాయుడుకి ఖాళీ ఖజానాతో ఏపీ చేతికి వచ్చింది. ఆ పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణతో పోటీ పడుతూ ఏపీని అభివృద్ధి చేయడం చాలా గొప్ప విషయమే.
ఆ తర్వాత జగన్ 5 ఏళ్ళ అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పధకాలు, వాటి ప్రచారం, రాజకీయ కక్ష సాధింపులు తప్ప మరొకటి వినపడేవి, కనబడేవి కావు.
అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునేవారు. అప్పుడు ఏపీ ప్రజలు తెలంగాణతో ఏపీని పోల్చి చూసుకుంటూ నిట్టూర్చేవారు.
కానీ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అయ్యాయి.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టి నెలరోజులు కాక ముందే అప్పుడే రాష్ట్రంలో అమరావతి, అభివృద్ధి పనులపై నిర్ణయాలు, పరిశ్రమలు, పెట్టుబడులపై చర్చలు మొదలయ్యాయి. మచిలీపట్నం లేదా శ్రీకాకుళంలో రూ.60-70 వేల కోట్ల భారీ పెట్టుబడితో భారత్ పెట్రోలియం రిఫైనరీ సంస్థని ఏర్పాటుకు చర్చలు మొదలవడం గమనిస్తే ఈసారి చంద్రబాబు నాయుడు మరింత వేగంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది.
తెలంగాణ విషయానికి వస్తే గత ఆరు నెలలుగా ఆ రాష్ట్రంలో ప్రధానంగా రాజకీయాలే జరుగుతున్నాయి. అందుకు కారణం కేసీఆరే అని చెప్పక తప్పదు.
ఇదివరకు జగన్ ప్రభుత్వం తమని ఎంతగా వేదిస్తున్నా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు ఎన్నికల వరకు ఓపికగా అన్నిటినీ భరించారు. ప్రజాస్వామ్య విధానం ప్రకారం ఎన్నికలలో జగన్ని ఓడించి మళ్ళీఅధికారంలోకి వచ్చారు.
కానీ అధికారం కోల్పోవడాన్ని, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్, వీలైనంత త్వరగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారు. కనుక రేవంత్ రెడ్డి కూడా పాలన, అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడుల కంటే ఎక్కువగా బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాల్సివస్తోంది. తెలంగాణలో రెండు పార్టీల మద్య జోరుగా రాజకీయాలు సాగుతుండటంతో అభివృద్ధి కుంటుపడిన్నట్లు కనిపిస్తోంది. కనుక ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆంధ్రాతో తమ రాష్ట్రాన్ని పోల్చి చూసుకోవలసివస్తుందేమో?




