తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం హాట్ డిస్కషన్ టాపిక్ థియేటర్ల పర్సంటేజ్ వర్సెస్ రెంటల్ విధానం. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు పర్సంటేజ్ విధానం మాకు వద్దని మొండిపట్టుతో వ్యవహరిస్తుండగా, ఎగ్జిబిటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు మాత్రం మాకు రెంటల్ పద్ధతిలో కనీస స్థాయి లాభాలు కూడా రావట్లేదని, పర్సంటేజ్ అయితేనే సమంజసమని, ఈ రెంట్ పద్ధతి వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభాలు అనుభవిస్తుండగా.. తమకు మాత్రం ఏమీ మిగలడం లేదని వాపోతున్నారు.
అయితే.. ఈ సమస్య ఇప్పటిది కాదు, ఎప్పుడో 2009లో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు సీనియర్ నిర్మాత కే.ఎస్.రామారావు సింగిల్ స్క్రీన్స్ అనేవి మిగలకుండాపోతున్నాయి, అందుకు కారణం వారికి ఎలాంటి లాభాలు లేకపోవడమే అని గ్రహించి.. పర్సంటేజ్ వ్యవస్థ అయితే సింగిల్ స్క్రీన్స్ & ఎగ్జిబిటర్లు బాగుపడతారని నిర్మాతలు-డిస్ట్రిబ్యూటర్లు-ఎగ్జిబిటర్ల మధ్య ఓ అగ్రిమెంట్ తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే.. తర్వాత రాష్ట్ర విభజన జరగడం, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కాస్త, తెలుగు ఫిలిం ఛాంబర్ గా మారడంతో కే.ఎస్.రామారావు ప్రతిపాదనను పక్కనపెట్టేశారు.
ఆ తర్వాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, ఆసియన్ సినిమా, సురేష్ బాబు వంటి ప్రముఖులు థియేటర్ల లీజు సిస్టంని తీసుకొచ్చి ఎగ్జిబిటర్లకి, థియేటర్ ఓనర్లకు కొంత ఆసరా ఇచ్చారు. అయితే.. ఆ లీజు వ్యవస్థ ఎగ్జిబిటర్లకంటే.. వారు అగ్ర నిర్మాతలుగా అధికారం చలాయించడానికే ఎక్కువగా ఉపయోగపడింది అనుకోండి.
అయితే.. రీసెంట్ గా రిలీజైన “దురంధర్ 1 & 2” సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో మంచి లాభాలు వచ్చినా.. ఎగ్జిబిటర్లకి లేదా థియేటర్ ఓనర్లకి నామమాత్రంగా ఇవ్వాల్సిన రెండు లక్షల రెంట్ ని మాత్రమే ముట్టజెప్పి.. లాభాలన్నీ డిస్ట్రిబ్యూటర్లు వెనకేసుకున్నారు. అదే ఒక సినిమా ఫ్లాపై లక్షరూపాయలు కలెక్ట్ చేస్తే మాత్రం షేరింగ్ అంటూ 50,000/- రూపాయలు వాళ్ల చేతిలో పెట్టేస్తున్నారు.
ఈ విషయమై సీరియస్ అయిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్న పర్సంటేజ్ విధానంలోనే తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా నడవాలని నిర్ణయించారు. దాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ అపోజ్ చేయడమే కాక, అలా పర్సంటేజ్ విధానంలో నడిచే థియేటర్లలో తమ సినిమా విడుదల చేయమని స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో సీరియస్ అయిన ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్లు.. ఇలా అయితే మే 1 నుండి సింగిల్ స్క్రీన్లు క్లోజ్ చేస్తామని నిర్ణయించుకున్నారు.
మరి ఈ పర్సంటేజ్ వర్సెస్ రెంటల్ పద్ధతిలో ఎవరు కరెక్ట్? దేనివల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. అయితే.. సగటు సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే సింగిల్ స్క్రీన్లు క్లోజ్ అవ్వడం అనేది అటు నిర్మాతలకి, ఇటు ప్రేక్షకులకి నష్టమే. మరి ఈ విషయంలో ఇరు వర్గాలు ఎలాంటి నిర్ణయానికి వస్తారో చూడాలి.




