సినీ పరిశ్రమ సమస్య కాస్త ఒక సినిమా సమస్యగా మారిన “థియేటర్ల బంద్” ప్రచారం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కార్యాలయం నుంచి మరో ప్రకటన విడుదలయ్యింది.
థియేటర్ల బంద్ వెనుక ఉన్న ఆ అదృష్ట శక్తులెవ్వరన్న దాని పై విచారణకు ఆదేశించిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. దీనితో అసలు ఎం జరుగుతుంది, ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు వాస్తవాలేమిటి.? అన్న దాని పై పవన్ ఆరా తీశారు.
అలాగే ఇక నుంచి సినిమా టికెట్ రేట్ల పెంపు విషయమై ప్రభుత్వం తో చర్చలు జరపడానికి సినీ రంగం నుండి సంబంధిత విభాగాల అధినేతలే రావాలని, చివరికి అది తన సినిమా విషయంలో అయినా ఇదే ఫార్ములా వర్తిస్తుందని తేల్చి చెప్పారు పవన్.
ఇక ఈ థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక జనసేన సభ్యుల హస్తం ఉందంటూ సినీ పరిశ్రమ పెద్దల నుంచి వస్తున్న ఆరోపణల మీద కూడా స్పందిస్తూ వారు సొంత పార్టీ నేతలైన ఉపేక్షించేది లేదని, తగిన చర్యలు ఉండాల్సిందే అంటూ ప్రకటించారు.
తాజా పరిణామాలతో విచారణ చేపట్టిన జనసేన థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక రాజమండ్రి జనసేన సిటీ ఇంచార్జ్ ‘అత్తి సత్యనారాయణ’ హస్తం ఉందంటూ ఆరోపణలు రావడంతో ఆయనను ప్రస్తుతానికి పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తమ్ముడు తనవాడైన ధర్మం తప్పకూడదు అనే సామెత మాదిరి ఈ వివాదంలో తొలి వికెట్ జనసేన నుండి రావడం పవన్ అభిమానులలో, జనసేన కార్యకర్తలలో కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనితో తన పై వస్తున్న ఆరోపణల పై వాస్తవాలు నిక్కు తేలే వరకు జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ అత్తి సత్యనారాయణకు ఆదేశాలు అందాయి.




