సినీ ఇండస్ట్రీకి సంబంధించిన డ్రగ్స్ కేసుకు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? నిజంగానే ఏమీ లేదు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జగన్ పేరు అసలు లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓ సారుప్యత మాత్రం జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో మరియు ఈ డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో నెలకొంది. అవును… ఇప్పటికే జగన్ కు సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.
అయినప్పటికీ, ఇప్పటికి తనను అనవసరంగా ఈ కేసులలో ఇరికించారని జగన్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం రాజకీయ కక్ష్యలో భాగంగా పెట్టిన కేసులేనని, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని జగన్ చెప్పే సంగతులు ఈనాటివి కావు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ సెలబ్రిటీలు కూడా జగన్ అనుసరించిన విధానాలనే చేపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు తెరపైకి వచ్చిన సెలబ్రిటీలందరూ, తామేం పాపం చేయలేదని తమ గోడును వెలిబుచ్చుకున్న విషయం చూస్తూనే ఉన్నాం.
కొందరు సెలబ్రిటీలు అసలు స్పందించలేదు గానీ, మీడియా వర్గాల ద్వారా తమ అభిప్రాయాలు చెప్పిన వారు మాత్రం ‘డ్రగ్స్ కేసుకు, తమకు సంబంధం లేదని’ వివరణ ఇచ్చుకుంటున్నారు. మరి ఎవరూ ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే… నాడు జగన్ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులన్నీ ఎవరివి? నేడు సిట్ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని కుండబద్దలు కొట్టే విధంగా అధికారులు ఎందుకు చెప్తారు? బహుశా నోటీసులు ఇచ్చిన వారందరికీ ఈ కేసుతో సంబంధం ఉండకపోయినప్పటికీ, కొంతమందికైనా ఇందులో భాగస్వామ్యం లేకుండా పోతుందా?
ఈ మొత్తం ఎపిసోడ్ లో కొంత స్పష్టత ఈ నెలాఖరుకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. బుధవారం నాడు పూరీ జగన్నాధ్ తో విచారణ క్లాప్ కొట్టబోతున్న సిట్ అధికారులు, ఈ నెల 28వ తేదీన యువ హీరో తనీష్ తో ముగించనున్నారు. అలాగే 20న చార్మి, 21న ముమైత్ ఖాన్, 22న సుబ్బరాజుని, 23న కెమెరా మెన్ శ్యాం కే నాయుడుని, 24న మాస్ మహారాజా రవితేజను, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న నవదీప్ ను, 27న తరుణ్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు జారీ చేసారు. అదేదో సామెత చెప్పినట్లుగా… “అందరూ శ్రీవైష్ణవులే అయితే బుట్టలో ఉన్న చేపలు ఎలా మాయమైనట్లు..?”తయారైంది పరిస్థితి!



