మలయాళంలో మోస్ట్ బ్యాంకబుల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న యువకథానాయకుడు టోవినో థామస్. మలయాళంలో కేవలం 13 ఏళ్లలో దాదాపుగా 50 సినిమాల్లో నటించిన ఘనత కూడా టోవినో థామస్ సొంతం. అలాంటి సూపర్ యాక్టివ్ హీరో డేట్స్ కోసం నిర్మాతలు పోటీపడడం అనేది సర్వసాధారణం. అందులో మన తెలుగు నిర్మాతలు కూడా ఉన్నారు.
టోవినో ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో నటించకపోయినా.. అతడు హీరోగా మలయాళ సినిమా రూపొందించడానికి మన తెలుగు నిర్మాతలు క్యూ కట్టారు. అందులో మైత్రీ మూవీ మేకర్స్ ప్రముఖులు. మలయాళంలో టోవినోతో “అదృశ్య జలకంగళ్, నడికర్” వంటి సినిమాలు రూపొందించారు. ఆ సినిమాలు కనీసం విడుదలయ్యాయి అనే విషయం కూడా జనాలకి తెలియకుండా థియేటర్ల నుండి వెళ్లిపోయాయి. ఆ తర్వాత మైత్రీ మలయాళంలో సినిమాలు తీయడం మానేసి, తమిళంవైపు దృష్టిపెట్టింది.
అలాగే.. టోవినో రీసెంట్ సినిమా “పళ్లి చట్టంబి” సినిమాతో నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ సి క్యూబ్ బ్రోస్ అనే సంస్థతో ముగ్గురు నిర్మాతలు మలయాళంలో సినిమా రూపొందించారు. డీసెంట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ అయితే రెండు రోజులకే తుడిచిపెట్టుకుపోయింది.
ఇక ఎన్టీఆర్ “డ్రాగన్” సినిమాలోనూ తొలుత టోవినో థామస్ ను మెయిన్ విలన్ గా తీసుకొని కొంత షూటింగ్ కూడా అయ్యాక.. షెడ్యూల్ బ్రేక్ తర్వాత టోవినో డేట్స్ కుదరకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో ఆ సీన్స్ అన్నీ మళ్లీ రీషూట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ & టీమ్.
ఈ విధంగా.. మలయాళంలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న టోవినో థామస్, తెలుగు నిర్మాతల పాలిట విలన్ గా మారాడు. ఈ లెక్కన టోవినో స్ట్రయిట్ తెలుగు సినిమా అనేది కష్టమే.







