మహారాజుగారి ఆస్థానంలో కొలువంటే బంగారు నాణాలు బహుమతిగా లభించవచ్చు. కొరడా దెబ్బలు పడవచ్చు. ట్రంప్తో మోడీ దోస్తీ చివరికి ఇలాగే సాగుతోంది.
మోడీ నా ఆప్త మిత్రుడు అంటూనే, ట్రంప్ భారత్పై మరో 25 శాతం పన్ను పెంచేశారు. తాజా పెంపుతో కలిపి మొత్తం 50 శాతం అయ్యింది.
ట్రంప్ బెదిరింపులకు భయపడబోమని భారత్ కూడా స్పష్టం చేసింది. తనకు భారత్ ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. కనుక దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అంటే తగ్గేదేలే… అని చెప్పేసినట్లే! కానీ అమెరికాతో ఏటా జరుగుతున్న లక్షల కోట్ల వ్యాపారాలను మోడీ ఏవిదంగా కాపాడగలరు?
రష్యా-ఉక్రెయిన్ లేదా ఇరాన్-ఇజ్రాయెల్ మద్య యుద్ధం జరుగుతుంటే ‘పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని’ తాపీగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడలా కుదరదు. నేటి నుంచే 25 శాతం పన్నులు అమలులోకి వచ్చాయి. ఈ నెల 27 నుంచి మరో 25 శాతం బాదుడు మొదలవుతుంది.
కనుక తగ్గేదేలే అంటే సరిపోదు… ఎలా నెగ్గాలో కూడా ఆలోచించాలి. తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. లేకుంటే భారత్ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఆనంద్ మహీంద్రవంటి పారిశ్రామికవేత్తలు ఇప్పటికే స్పందిస్తూ ఈ సవాలును అవకాశంగా మలుచుకొని కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత్ ముందున్న ఏకైక మార్గం కూడా ఇదే.
ఇది ఓ ఆర్ధిక యుద్ధమే కనుక కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక నిపుణులు, మేధావులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు వంటి వారితో సమావేశమయ్యి అవసరమైన సలహాలు సూచనలు తీసుకుంటే మంచిదే.
కానీ మద్యలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు, బిహార్ శాసనసభ ఎన్నికల హడావుడీ కూడా ఉన్నాయి. వాటిని చూసుకుంటూనే కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నష్ట నివారణ చర్యలు చేప్పటాల్సి ఉంటుంది.
మరి మోడీ ప్రభుత్వం ఎంత త్వరగా దీనికి పరిష్కారం కనుగొని భారత్ని గట్టేకిస్తుందో చూడాలి!






