అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తున్నాయి. వివిధ దేశాల ఉత్పక వాణిజ్యాల ఎగుమతుల పై ట్రంప్ విధిస్తున్న సుంకాలు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను పతనం వైపుకి నెట్టేస్తున్నాయి.
సంస్కరణల పేరుతో అగ్ర రాజ్య అధ్యక్షుడు తీసుకున్న టారిఫ్ నిర్ణయాలతో భారత దేశీయ మార్కెట్లు కూడా కుప్పకూలిపోయాయి. కరోనాను మించిన బ్లడ్ బాత్ ను సృష్టిస్తున్న ఈ ట్రంప్ టారిఫ్ వైరస్ కు వాక్సిన్ లేదా అంటూ గగ్గోలు పెడుతున్నారు ఇన్వెస్టర్లు.
నేడు భారత స్టాక్ మార్కెట్ సెషన్ ఆరంభంలోనే నిఫ్టీ 1160 పాయింట్లు, సెన్సెక్స్ 3939 పాయింట్ల మేర నష్టాలను చవి చూసి ఇన్వెస్టర్ల పాలిట రెడ్ మండేగా మారిపోయింది. దీనితో ఈ ఒక్క రోజే సుమారు 19 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2020 కరోనా మహమ్మారి సమయంలో స్టాక్ మార్కెట్లు ఈ తరహా ఫాల్ ను ఎదుర్కొన్నాయి. ఆ తరువాత మరే విపత్తు కూడా అంతర్జాతీయ మార్కెట్లను, ముఖ్యంగా భారతీయ మార్కెట్లను ఈ స్థాయిలో ప్రభావితం చెయ్యలేదు. అటు అమెరికా మార్కెట్లు కూడా గత నాలుగైదు మార్కెట్ సెషన్ల నుంచి భారీ నష్టాలను చవి చూస్తున్నాయి.
అయినా ట్రంప్ మాత్రం తగ్గేదెలా అన్నట్టుగా తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా టారిఫ్ ల విషయంలో మరో ఆలోచన లేదంటూ తెగేసి చెపుతున్నారు. దీనితో అగ్ర రాజ్యం రెసిషన్ బాట పట్టడం ఖాయమంటూ ముందస్తు హెచ్చరికలు జారీచేస్తున్నారు ఆర్థికవేత్తలు.
అమెరికా విధించిన సుంకాల దెబ్బకు అటు స్టాక్ మార్కెట్లే కాదు ఇటు బంగారం ధరలు కూడా కిందకు దిగొస్తున్నాయి. గత మూడు రోజులలో బంగారం సుమారు 3 వేల రూపాయిలు తగ్గి ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90380 కి చేరింది. గత నెలలో 10 గ్రాముల బంగారం ధర 90980 మార్క్ ను టచ్ చేసి ఆల్ టైం హైస్ ను చూసింది.
స్టాక్ మార్కెట్లో ట్రంప్ వదిలిన ఈ టారిఫ్ వైరస్ తో బ్లడ్ బాత్ గా మారిన తమ ఫోర్ట్ ఫోలియోలు తిరిగి కోలుకునేదెప్పుడు.? ఈ వైరస్ కు వాక్సిన్ లేదా.? ట్రంప్ తన విజయంతో ప్రపంచ దేశాలను విధ్వంశం దిశగా నడిపిస్తున్నారా.? అసలు ఈ ట్రేడ్ వార్ కి కారణమేమిటి.? ఈ భారీ నష్టాలతో ఇన్వెస్టర్లు మార్కెట్లలో నిలబడగలుగుతారా.? అనే ప్రశ్నలు ఇప్పుడు అన్ని దేశాల ఇన్వెస్టర్ల మెదడును తొలిచేస్తున్నాయి.
అయితే ఈ టారిఫ్ దెబ్బ మార్కెట్ లో మరికొన్ని రోజుల పాటు బ్లడ్ బాత్ ను సృష్టించడం ఖాయమని, చోటా మోట ఇన్వెస్టర్స్ మరికొన్ని రోజుల పాటు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండడం మరి ముఖ్యంగా ఈ ఒడిదుడుకులలో ఈక్విటీ ల వైపు ఆలోచన చేయడం అంత మంచిది కాదంటూ హితవు పలుకుతున్నారు మార్కెట్ నిపుణులు.




