రైల్వే, ఎయిర్ లైన్స్, ఆర్టీసీ, చివరికి షేరింగ్ ఆటో రిక్షాలు సైతం గిట్టుబాటు కావడం లేదంటూ ప్రయాణికుల నుంచి ముక్కు పిండి మరీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వందల కోట్లు బడ్జెట్తో తీస్తున్న సినిమాలకు ఈ టికెట్ ఛార్జీలు సరిపోవంటూ ప్రభుత్వాలే ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తున్నాయి.
మరి అటువంటప్పుడు తెలంగాణ ఆర్టీసీ బస్సులలో గత 19 నెలలుగా మహిళల నుంచి ఒక్క పైసా తీసుకోకుండా మహాలక్ష్మీ పధకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంటే టీఎస్ ఆర్టీసీకి ఏవిదంగా లాభాలు వచ్చేస్తున్నాయో తెలంగాణ ప్రభుత్వమే వివరించాలి.
మహాలక్ష్మీ పధకంతో ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ 62 శాతం నుంచి 97 శాతానికి పెరిగిందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. డబ్బులిచ్చి టికెట్ తీసుకోనవసరం లేదు కనుక మహిళల ఆక్యుపెన్సీ విపరీతంగా పెరగడం సహజం.
మొన్న మంగళవారంతో తెలంగాణ ఆర్టీసీలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయ్యాయని, వీటి ద్వారా రాష్ట్రంలో మహిళలు రూ.6,680 కోట్లు లబ్ది పొందారని మంత్రి పొన్నం స్వయంగా చెప్పారు. ఈ మేరకు ఎక్స్ సోషల్ మీడియాలో సగర్వంగా ప్రకటించుకున్నారు కూడా. అంటే టీఎస్ ఆర్టీసీ ఆ మేరకు ఆదాయం కోల్పోయిందనే కదా అర్ధం?
మహాలక్ష్మి పధకం ద్వారా టీఎస్ ఆర్టీసీ ఆదాయం కోల్పోతున్నందునే తెలంగాణ ప్రభుత్వం నెలకు సుమారు రూ.250-300 కోట్లు చొప్పున ఆర్టీసీకి చెల్లిస్తోంది. దీని కోసం ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో రూ.4,305.49 కేటాయించింది కూడా. అంటే ఈ పధకం భారం ప్రభుత్వంపై పడుతోందన్న మాట!
కనుక మహిళలకు ఇచ్చిన హామీ నిలుపుకునేందుకు ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు చేస్తోందని చెప్పుకుంటే చాలా హుందాగా ఉండేది. కానీ టికెట్ కొనుగోలు చేయని మహిళలతో ఆక్యుపెన్సీ పెరిగితే తెలంగాణ ఆర్టీసీకి లాభాల బాట పట్టిందని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదెలా ఉందంటే దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయమన్నట్లే ఉంది కదా?




