జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియాపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 10,14 తేదీలలో సాక్షి మీడియాలో టీటీడీ గురించి నిరాధారమైన వార్తలు ప్రచురించి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు. సాక్షి మీడియా తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, టీటీడీకి రూ.10 కోట్లు చెల్లించాలని బీఆర్ నాయుడు డిమాండ్ చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి టీటీడీని టార్గెట్ చేసుకొని నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే ఉంది. దుష్ప్రచారం చేస్తూనే ఉంది. అసలు వైసీపీ నేతలు తిరుమలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చెప్పాలి.
తిరుమల శ్రీవారి భక్తులు కానీ మేము గానీ ఎన్నడూ ఇతర మతాల గురించి, ప్రార్ధనా మందిరాల గురించి ఇలా ఎప్పుడైనా మాట్లాడేమా?లేదు కదా? వేరే మతానికి చెందిన జగన్ రెడ్డి, భారతీ రెడ్డి దంపతులకు, కరుణాకర్ రెడ్డికి తిరుమలతో ఏం సంబంధం?
ఒకవేళ ఉందనుకుంటే అందరూ వచ్చి గుండు కొట్టించుకొని పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తిని వెళ్ళండి. అంతేకానీ టీటీడీ గురించి, తిరుమల శ్రీవారి ఆలయం గురించి అవాకులు చెవాకులు వాగొద్దు.
అన్య మతస్థుడైన భూమన కరుణాకర్ రెడ్డిని టిటిడీ చైర్మన్గా నియమించడమే చాలా తప్పు. మళ్ళీ అయన తిరుమలలో చేయకూడని అపచారాలన్నీ చేస్తూ, టిటిడీ సొమ్ముతో తన రియల్ ఎస్టేట్ వెంచర్కు రోడ్లు కూడా వేయించుకున్నారు. ఇటువంటి పాపాలకు వైసీపీ నేతలు తప్పకుండా ఏదో రోజు శిక్ష అనుభవిస్తారు.
ఏపీ సిఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, టిటిడీలో మేము బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే తిరుమలలో సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాము.
గతంలో రోజుకి 60-65 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వారు. ఇప్పుడు రోజుకి 80-85వేల మంది దర్శించుకొని సంతృప్తిగా వెళుతున్నారు. ఒక వీఐపీకి పట్టే సమయంలో కనీసం 25 మంది సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోగలరు. కనుక మరింత మంది సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించేందుకే వీఐపీల కోటా తగ్గిస్తున్నాము తప్ప వేరే ఉద్దేశ్యం లేదు.
ఏది ఏమైనప్పటికీ టిటిడీ గురించి, తిరుమల శ్రీవారి ఆలయం గురించి మాట్లాడే నైతిక హక్కు అన్యమతస్తులైన జగన్కి, వైసీపీ నేతలకు లేదు. కనుక ఇకనైనా తిరుమల శ్రీవారి జోలికి రాకుండా ఉంటే వారికే మంచిది,” అంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.






