నేడు ఉగాది పండుగ… తెలుగువారికి నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. ముందుగా అందరికీ ఉగాది పండుగ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఇప్పటికే అందరూ షడ్రుచుల ఉగాది పచ్చడి రుచి చూసే ఉంటారు. కొత్త పంచాంగాలు తిరగేసి ఈ కొత్త సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకునే ఉంటారు. మరికాస్త ఆసక్తి ఉన్నవారు పంచాంగ శ్రవణం కూడా వింటూనే ఉంటారు.
ఇది ‘పరాభవ నామ సంవత్సరం’ కనుక చాలా మంది తమకు ఎటువంటి సమస్యలు, పరాభవాలు ఎదుర్కోవలసి వస్తుందో అని లోలోన భయపడుతుండవచ్చు. కానీ పరాభవం ఎవరికి? అంటే అసూయ, ద్వేషం, అత్యాశ, అహంకారం, దుర్బుద్దులు వంటి అవలక్షణాలు కలిగినవారికే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అటువంటివారు ఏదో సందర్భంలో పరాభవాలు ఎదుర్కోవడం అందరూ చూస్తూనే ఉన్నారు.
కానీ సామాన్య ప్రజలకు ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల వలన కొన్నిసార్లు పరాభవాలు ఎదుర్కోవలసి రావచ్చు. ఉగాది పచ్చడిలో చేదుని మహా ప్రసాదంగా స్వీకరించినట్లే, జీవితంలో ఆటుపోట్లను కూడా స్వీకరిస్తూ ముందుకు సాగిపోక తప్పదు.
అమెరికా-ఇరాన్ యుద్ధం.. దాని వలన గ్యాస్ కొరత కబుర్లు కాసేపు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని చూసిన్నట్లయితే, ఈ ఒకటిన్నర ఏళ్ళలో చాలా అభివృద్ధి జరిగింది. జరుగుతున్న పనులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా.
కూటమి ప్రభుత్వం ప్రతీ క్షణం అమూల్యమైనదే అన్నట్లు సద్వినియోగం చేసుకుంటూ శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తోంది. ఇదే వేగంగా అభివృద్ధి పనులు కొనసాగితే, పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తే 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఓ అతిపెద్ద ‘గ్రోత్ ఇంజన్’గా నిలుస్తుంది.
ఏ రాష్ట్రం, దేశమైన వేగంగా అభివృద్ధి చెందాలంటే రాజకీయ సుస్థిరత ఉండాలి. పాలకులకు దూరదృష్టి, అభివృద్ధి చేసుకోవాలనే తపన, చిత్తశుద్ధి ఉండాలి. అదృష్టవశాత్తు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి.
కూటమిలో మూడు పార్టీల మద్య సఖ్యత ఉంది. కేంద్రంతో కూడా సఖ్యత ఉంది. ముఖ్యంగా కూటమిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురి మద్య మంచి సఖ్యత ఉండటం రాష్ట్రానికి చాలా మేలు చేసేదే.
ఋషులు లోకహితం కొరకు యజ్ఞయాగాదులు చేస్తుంటే రాక్షసులు వాటిని భగ్నం చేసేందుకు ప్రయత్నించేవారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి మహాయజ్ఞాన్ని కూడా భగ్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అలాంటి దుష్ట శక్తులకు ప్రజల చేతిలో పరాభవం తప్పదు.




