ఉండవల్లి ప్రవచనాలు అవసరమా?

Undavalli-Arun-Kumarరాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయానని చెపుతూ రాజకీయ సన్యాసం ప్రకటించిన కాంగ్రెస్‌ నేతల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా ఒకరు. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలోను చేరలేదు కానీ రాజకీయాలపై తన అమూల్యమైన అభిప్రాయాలు ఉచితంగా ప్రజలకు తెలియజేస్తుంటారు.

ADVERTISEMENT

రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయినందుకు ఆయనను ఎవరూ వేలెత్తి చూపలేదు. కానీ గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి చాలా సన్నిహితుడుగా మెలిగారు కనుక సిఎం జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా మార్గదర్శనం చేస్తారని చాలా మంది భావించారు. కానీ ఉండవల్లి ప్రవచనాలకే పరిమితం కావడంతో అందరూ తప్పు పడుతున్నారు.

గత మూడేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా ఓ దశ, దిశ లేకుండా సాగుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కనుక వైఎస్సార్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబందాన్ని వినియోగించుకొని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వైసీపీ ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు చేసి ఉంటే, ఏపీ అభివృద్ధి పట్ల తపన, చిత్తశుద్ధి వ్యక్తం అయ్యేది. అటువంటి ప్రయత్నం చేసి విఫలమైనా తప్పులేదు. కానీ ఆ ప్రయత్నం చేయకుండా రాజకీయాలపై తనకున్న అవగాహన, పట్టును ప్రదర్శించుకోవలసిన అవసరం ఏమిటి?అనేది సామాన్య ప్రజల ప్రశ్న.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా-జూ.ఎన్టీఆర్‌ భేటీపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందిస్తూ, “వారి భేటీ వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. బహుశః జూ.ఎన్టీఆర్‌ చేత రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రచారం చేయించుకోవాలని బిజెపి భావిస్తోందేమో? ఏమైనప్పటికీ వారి భేటీతో రాజకీయాలపై ప్రభావం చూపుతుందని నేను భావిస్తున్నాను,” అని చెప్పారు. అమిత్‌ షా-జూ.ఎన్టీఆర్‌ భేటీ గురించి ఇప్పటికే మీడియా, సోషల్ మీడియా చాలా లోతుగా రకరకాలుగా విశ్లేషించి చెప్పాయి. ఉండవల్లి మళ్ళీ అదే చెప్పి ఏం ప్రయోజనం?

ADVERTISEMENT
Latest Stories