ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వర్రా రవీంద్రా రెడ్డితో సుమారు 600 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. వారిలో కొందరు పోలీస్ స్టేషన్ దశలో, మరికొందరు కోర్టు దశలో, మరికొందరు జైలు దశలో ఉన్నారు. వైసీపి సోషల్ మీడియాలో సామాన్య కార్యకర్తలను ఎంత మందిని పోలీసులు అరెస్ట్ చేసినా వైసీపీకి, అధినేత జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఇప్పటికే వారి స్థానాలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో భర్తీ చేసేశారు. కొత్తవారిని రిక్రూట్ చేసుకోగలరు కూడా.
కానీ సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వర్రా రవీంద్ర రెడ్డి వంటివారు పోలీసుల విచారణలో నోరు విప్పితే చాలా ప్రమాదం. వారు నోరు విప్పకపోయినా జగన్ వారిని విడిపించుకోలేకపోతే సజ్జల రామకృష్ణా రెడ్డి, అవినాష్ రెడ్డి వంటివారికి కోపతాపాలు మొదలైతే వైసీపిలో అంతర్గతంగా చిచ్చు రగిలే ప్రమాదం కూడా ఉంటుంది.
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నవారిని ఉపేక్షించనవసరం లేదని, తాము కూడా సోషల్ మీడియా బాధితులమేనని హైకోర్టు తేల్చి చెప్పేసింది. కనుక ఒకవేళ జగన్ వారిని వెనకేసుకు వచ్చినా న్యాయపరంగా కూడా మరిన్ని ఇబ్బందులు తప్పవు.
ఒకవేళ ఈ కేసులు, అరెస్టుల వలన సజ్జల రామకృష్ణా రెడ్డి, అవినాష్ రెడ్డికి ఆగ్రహం కలిగితే దానికి సిఎం చంద్రబాబు నాయుడు కాదు… జగన్మోహన్ రెడ్డే బలయ్యే ప్రమాదం పొంచి ఉంది.
కనుక వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఏవిదంగా వెనకేసుకువచ్చి కాపాడుకున్నారో, అదేవిదంగా ఈ కేసులలో కూడా అరెస్ట్ అయిన, కాబోతున్న వైసీపి ముఖ్య నేతలనీ జగన్ కాపాడుకోవలసి ఉంటుంది.
ఈ కోణంలో నుంచి చూస్తే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినందుకే కూటమి ప్రభుత్వం వారిపై కేసులు, అరెస్టులు చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా, రాజకీయ కోణంలో నుంచి కూడా ఆలోచించి చాలా వ్యూహాత్మకంగా జగన్కు చెక్ పెడుతోందని చెప్పవచ్చు.




