ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమని జగన్ మోసం చేశాడని అనుకుంటే తప్పులేదు. మాట తప్పను మడమ తిప్పనని నేటికీ గొప్పలు చెప్పుకునే జగన్ అమరావతి విషయంలోనే మొదటిసారి ప్రజలను మోసం చేశారు. ఆ తర్వాత లెక్కేలేదు. అందుకే ప్రజలు జగన్ని, వైసీపిని నిర్మొహమాటంగా తిరస్కరించారు.
అయితే జగన్ తమని కూడా మోసం చేశారని వైసీపిని వీడుతున్న ప్రతీ ఒక్కరూ చెపుతూనే ఉన్నారు. తాజాగా వైసీపి సీనియర్ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపికి రాజీనామా చేషారు.
ఆమె జగన్కి పంపిన తన రాజీనామా లేఖలో ప్రజలని, పార్టీ నాయకులని అందరినీ మోసం చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మీ దృష్టి తీసుకువచ్చినా పట్టించుకోలేదు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసమస్యలను పట్టించుకోకుండా ఓ నియంతలా వ్యవహరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అధికారం కోల్పోయాక ఇప్పుడు కార్యకర్తలు గుర్తుకువచ్చి వారి కోసం ‘గుడ్ బుక్’ తెరుస్తామంటున్నారు. అయితే గుడ్ బుక్ కాదు కావాల్సింది గుండె బుక్.
వైసీపి అధికారంలో ఉన్నంతకాలం ఇలాంటి నినాదాలు, ప్రమోషన్స్తోనే నడిపించారు తప్ప ఓ రాజకీయపార్టీలా నడిపించలేకపోయారు. ఇప్పుడూ అలాగే నడిపిస్తున్నారు. నిర్ధిష్టమైన విధానాలు, పార్టీ నేతలను, కార్యకర్తలను గౌరవించలేని మీ పార్టీలో కొనసాగలేను. అందువల్ల వైసీపి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను,” అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
వాసిరెడ్డి పద్మ వైసీపిలో చాలా సీనియర్ నాయకురాలు. రోజా వంటి బాగా నోరున్న నేతగా పేరొందారు. కనుక జగన్ తనకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని ఆశించారు కానీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ పదవితో సరిపెట్టారు.
అప్పటికీ… ఆమె ఆ పదవిలో ఉంటూ అత్యాచారాలకు గురైన బాధిత మహిళలకు అండగా నిలిచే బదులు జగన్ ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు కూడా నోటీసులు ఇచ్చి అధినేత మెప్పుకోసం చాలా ప్రయత్నించారు.
అటువంటి కీలకమైన పదవిలో పనిచేసి, సమాజంలో బాధిత మహిళలకు న్యాయం చేయలేకపోయిన వాసిరెడ్డి పద్మ ఇప్పుడు జగన్ హయాంలో మహిళలకు తీరని అన్యాయం జరిగిందని రాజీనామా లేఖలో ఆరోపించడం చాలా హాస్యస్పదంగా అనిపిస్తుంది.
ఆమెకు మంత్రి పదవి లభించకపోయినా సర్దుకుపోయి శాసనసభ ఎన్నికలలో టికెట్ ఆశించారు. కానీ జగన్ ఇవ్వలేదు. అప్పటి నుంచే ఆమె పార్టీకి దూరం అయ్యారు. ఒకవేళ వైసీపి మళ్ళీ అధికారంలోకి వచ్చి, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యుండి ఉంటే బహుశః ఆమె నేడు వైసీపిలోనే ఉండేవారు. ఎప్పటిలాగే ఆయనకు వంతపాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను విమర్శిస్తుండేవారు.
కానీ జగన్ అధికారం కోల్పోవడంతో మునిగిపోయే వైసీపి ఓడలో ఉండటం కంటే బయటపడి తనవంటి వారికి రాజకీయ ఆశ్రయం ఇస్తున్న జనసేనలో మెల్లగా చేరిపోవాలని ఆలోచిస్తున్నారేమో?




