సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు ‘మా ఎస్సీఎస్టీలు… మా బీసీలు..’ అని మాట్లాడుతుంటారు. ఎస్సీల కోసం మంత్రులు రోడ్లపై చొక్కాలు చించేసుకొని మరీ పోరాడుతున్నామంటారు. కానీ కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఎవరూ మాట్లాడరు.
కోడికత్తి కేసులో ఎటువంటి రాజకీయ కుట్రలేదని అని ఎన్ఐఏ చెప్పిన్నప్పటికీ ఆ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు (బీసీ) నేటికీ జైలులోనే మగ్గుతునే ఉన్నాడు. అయినా వైసీపీలో బీసీ మంత్రులు ఎవరూ అతని గురించి మాట్లాడరు.
మొన్న యలమంచి మండలం, చించినాడలో దళితుల భూములలో కొందరు వైసీపీ నేతలు మట్టి తవ్వకాలు జరుపుతుంటే వారికి అండగా నిలబడుతునందుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడునే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
తాజాగా మంగళవారం ప్రకాశం జిల్లాలో టంగుటూరులో టిడిపి ఎస్సీ సెల్ నాయకుడు సావలమ్ సుధాకర్ భార్య హనుమాయమ్మ (50)ను స్థానిక వైసీపీ నేత కొండలరావు ఆమె ఇంటి బయట నిలబడి ఉన్నప్పుడు వెనుక నుండి వచ్చి ట్రాక్టరుతో గుద్ది చంపేశాడు. అది ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే, ఆమె చనిపోయిందో లేదోనని అతను మళ్ళీ ట్రాక్టరును వెనక్కుతీసుకువచ్చి ఆమె మీదుగా నడిపించి తొక్కించి చంపేశాడు.
అంగన్వాడీ టీచరుగా పని చేస్తున్న ఓ దళిత మహిళను పట్టపగలు ఇంత దారుణంగా ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తే, ఇంతవరకు పోలీసులు నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని టిడిపి కొండపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి అడిగారు.
పట్టపగలు ఓ దళిత మహిళ హత్య జరిగితే, మహిళా హోంమంత్రి తానేటి వనిత, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని గానీ ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా స్పందించలేదని డోలా వీరాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులంటే వైసీపీ నేతలకు చాలా చులకన అని గ్రహించేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. ఇకనైనా ఆమెను అతికిరాతకంగా చంపిన కొండలరావును అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరారు. ఆమె కుటుంబాని రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం, బీటెక్ చేసిన ఆమె కూతురు మాధురికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డోలా వీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు.
“మా బీసీలు… మా ఎస్సీ,ఎస్టీలు… వారిని నేనే ఉద్దరిస్తున్నానని” సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటుంటే, వైసీపీ నేతలు వారితో ఈవిదంగా వ్యవహరిస్తుండటాన్ని ఏమనుకోవాలి? మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి మహిళల పట్ల చులకనగా వ్యవహరించారంటూ పవన్ కళ్యాణ్కు నోటీసులు పంపించిన వాసిరెడ్డి పద్మ ఓ దళిత మహిళను ఇంత కిరాతకంగా ట్రాక్టరుతో తొక్కించి చంపేస్తే స్పందించపోవడాన్ని ఏమనుకోవాలి? దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు ఎవరిని కాపాడేందుకు ఉన్నాయి?



