యధార్ధవాది లోక విరోధి అన్నారు పెద్దలు. వర్తమాన రాజకీయ పరిస్థితిలో ఇది మరింత బాగా వర్తిస్తుంది. ప్రభుత్వాలు లేదా పాలకులు, ప్రతిపక్షాలు, వివిధ వ్యవస్థలు తప్పులు చేస్తుంటే భజన చేయాలి తప్ప వేలెత్తి చూపకూడదు. చూపితే రాష్ట్ర లేదా దేశ లేదా జాతి వ్యతిరేక ముద్రపడిపోతుంది. వెంటనే సోషల్ మీడియాలో కాలకేయ ముఠాలు వెంటపడి వేధించడం మొదలుపెట్టేస్తాయి.
అయినా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా అధినేత, ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ ఆ తిట్లు, విమర్శలు పట్టించుకోకుండా చెప్పాలనుకున్నది నిష్కర్షగా చెప్పేస్తుంటారు.
వారం వారం ప్రసారమయ్యే ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’లో నేడు అలాగే ఒకటి కాదు… అనేక కుండలు టపీటపీమని బద్దలు కొట్టేశారు.
కానీ ఆయన చెప్పినవన్నీ చేదు నిజాలే. కానీ వాటిని పాలకులే కాదు ప్రజలు కూడా జీర్ణించుకోవడం చాలా కష్టం. కనుక ఆయనపై విమర్శల జడివాన మొదలయ్యే ఉంటుంది.
ఆయన చెప్పిన ముఖ్యవిషయాలు క్లుప్తంగా…
ఒకప్పుడు భారతీయులకు కష్టపడి పనిచేసే గుణం, పొదుపు ఉండేవి. ఆ రెండు మంచి లక్షణాల వల్లనే యావత్ ప్రపంచం తల్లకిందులైపోయినా ఆ ప్రభావం భారత్పై ముఖ్యంగా సామాన్య ప్రజలపై పడేది కాదు.
కానీ పాలకులే సంక్షేమ పధకాల పేరుతో ప్రజలను సోమరులుగా మారుస్తున్నారు. గతంలో ప్రజలను పొదుపు చేయమని ప్రభుత్వాలు ప్రోత్సహించేవి. కానీ ఇప్పుడు ఖర్చు చేయమని ప్రోత్సహిస్తున్నాయి.
ప్రైవేట్ సంస్థలు కూడా ప్రజలను పొదుపు నుంచి వినిమయవిధానంపై నడిపించి అప్పులు ఇచ్చి మరీ అవసరానికి, శక్తికి మించి డబ్బు ఖర్చు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి.
ఈవిధంగా కొనుగోలు చేయడం ద్వారా భారీగా డబ్బు ఆదా అవుతుందంటూ ప్రజలకు అవసరం లేని వస్తువులను అంటగడుతున్నాయి. క్రెడిట్ కార్డులు, అప్పులు ఇచ్చి మరీ ప్రజల చేత డబ్బు ఖర్చు చేయిస్తున్నాయి.
ఈ ప్రభావంతో ప్రజలు కూడా అవసరమున్నా లేకపోయినా అప్పులు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీనినే ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని వర్ణిస్తున్నాయి ప్రభుత్వాలు. కానీ ప్రజలు అప్పుల పాలైపోతున్నారనే విషయం దాచి పెడుతున్నాయి.
ప్రజలకు అప్పులు చేయడం అలవరిచిన ప్రభుత్వాలు కూడా అందినకాడికి అప్పులు చేస్తూ రకరకాల సంక్షేమ పధకాలతో ప్రజల చేతిలో డబ్బు పెడుతూ పని సంస్కృతికి ప్రజలను దూరం చేస్తున్నాయి. పనికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తున్న ప్రభుత్వాలే మళ్ళీ ఉపాధి హామీ పధకాలు అమలుచేస్తున్నాయి.
ఈవిధంగా ప్రభుత్వాలు, ప్రజలు కూడా ఆర్ధిక క్రమశిక్షణ మరిచి అగమ్యగోచరంగా ముందుకు సాగిపోతుంటే చివరికి ఈ దేశం ఏమవుతుంది? అంటూ వేమూరి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
అయన ఇంకా చాలా విషయాలు ప్రస్తావిస్తూ, మన పాలకుల ద్వంద వైఖరిని ఎండగట్టారు. ఆసక్తి కలిగినవారు అదివారం ఆన్లైన్లో సంచికలో ‘మన పొదుపు DNA పోతోంది’ అనే శీర్షికతో ప్రచురించిన ఆర్టికల్ చదవచ్చు.
వేమూరి రాధాకృష్ణ ఇంత పచ్చిగా చేదు నిజాలు చెపుతుంటారు కనుకనే యధార్ధవాది లోక విరోధి జాబితాలో అయన పేరు ఎప్పుడూ ఉంటుంది.




