కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గారి వాక్చాతుర్యం గురించి రాజకీయ విజ్ఞులకు తెలిసిన విషయమే. అనర్గళంగా పంచ్ లు వేయడంలో సిద్ధహస్తూడైన వెంకయ్య, మరోసారి తన పదునైన పంచ్ లతో చమత్కరించారు. బ్రిటీష్ వారు వారి మెంటాలిటీని భారతీయులకు అంటిచ్చి వెళ్లారని, ఇంగ్లిష్ భాష నేర్చుకోండి కానీ, వారి మెంటాలిటీ వద్దని కేంద్రమంత్రి వర్యులు పిలుపునిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వెంకయ్యకు ఈ రోజు బీజేపీ నేతలు సన్మానం చేసిన సందర్భంగా మాట్లాడుతూ… తెలుగు భాష గొప్పదనాన్ని, భారతీయ సంస్కృతిని గురించి చెప్పారు. మమ్మీ.. డాడీ.. బీడీ అని పిలవకూడదని, బోధన ఆంగ్లమయినా భావన భారతీయమే ఉండాలని చెప్పారు. మన అలవాట్లలో భారతీయత కనిపించాలని అన్నారు. చాలా మంది మన భాష మర్చిపోతున్నారని, అమ్మ, నాన్న, అక్క, బావ అనే పిలిస్తేనే చక్కగా ఉంటుందని ఇంగ్లిష్లో పిలవకూడదని అన్నారు.
కన్న తల్లిని, భూమిని, మాతృభాషను మర్చిపోకూడదని, యావత్ ప్రపంచం మన సంస్కృతిని మెచ్చుకుంటుందని, మన యాస గోస భాష కట్టు బాట్లలో ఎంతో గొప్పదనం ఉందని చెప్పారు. మలేషియాలోని ఓ ఎయిర్పోర్టులో దీపావళి పండుగ చేసుకున్నారని, ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో దీపావళి జరుపుకున్నారని, ప్రపంచం మన సంస్కృతి అనుకరిస్తోంటే మనం మర్చిపోతున్నామని అన్నారు. యువత సక్రమ మార్గంలో నడుచుకుంటేనే దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. అజ్ఞానాన్ని పూర్తిగా పారదోయాలని పిలుపునిచ్చారు.
‘పేపర్ బాయ్ అబ్దుల్ కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారు… నరేంద్ర మోదీ టీ అమ్మారు ఇప్పుడు మహానాయకుడు అయ్యారు. ప్రపంచంలోని ఏ దేశం వెళ్లినా మోదీ మోదీ అంటున్నారు. యువత వారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలి. భారత మాతాకీ జై అంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ జయము కలుగుగాకా అని అర్థం’ అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.



