సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. మొదటిరోజే ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఇటీవల ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో వేదికపైనే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. కొన్ని నెలల క్రితం గుండె నొప్పితో ధిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నారు. కనుక ఆరోగ్య కారణాలతోనే ధన్ఖడ్ పదవికి రాజీనామా చేశారనిపిస్తుంది.
కానీ ఆయన నిన్న ఉదయం కూడా రాజ్యసభ చైర్మన్ హోదాలో సభను చక్కగా నడిపించారని అంతలోనే అనారోగ్యం అంటే నమ్మశక్యంగా లేదని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపి అధిష్టానం ఒత్తిడి కారణంగానే అయన రాజీనామా చేసి ఉండవచ్చన్నారు.
బీజేపి ఒత్తిడికి కారణం కూడా ఆయనే చెప్పారు. త్వరలో బిహార్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కానీ ఈసారి బిహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్డీయే కూటమికి ఎదురుగాలి వీస్తోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.
కనుక బిహార్ ఎన్నికలలో ఎన్డీయే కూటమి గెలవాలంటే, ఆ రాష్ట్ర ప్రజల మనసులు గెలుచుకోవాలి. కనుక బిహార్కు చెందినా ఓ రాజకీయ నాయకుడిని ఉప రాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టడం ఒక్కటే దారి అని బీజేపి పెద్దలు భావించి ఉండవచ్చు. అందుకే ధన్ఖడ్ చేత రాజీనామా చేయించి ఉండవచ్చని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అభిప్రాయపడ్డారు. అవునో కాదో ఎలాగూ త్వరలోనే తెలుస్తుంది.






