కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ సినిమాకు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరో అయితే, మలయాళంలో మోహన్ లాల్ హీరో అన్న విషయం తెలిసిందే. అలాంటి లెజెండరీ హీరో మోహన్ లాల్ ను 3 దశాబ్దాల నాటి ఏనుగు దంతాల కేసు వదిలేలా లేదు. తాజాగా, నాటి ప్రభుత్వం మోహన్ లాల్ కు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణలపై విజిలెన్స్ కోర్టు విచారణకు ఆదేశించింది.
ఈ కేసు వివరాలను మరోసారి పరిశీలిస్తే, పన్ను ఎగవేత ఆరోపణలపై 1988 సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మోహన్ లాల్ ఇళ్లపై దాడులు చేశారు. ఆ సమయంలో రెండు జతల ఏనుగు దంతాలు ఆయన ఇంట కనిపించాయి. దీని ఆధారంగా ఆటవీ శాఖ మరో ప్రత్యేక కేసు నమోదు చేసింది. ఆపై విచారణ సాగుతుండగా, కేరళ మంత్రి రాధాకృష్ణన్, కేసును ఎత్తివేయాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆనాటి కేసు మరోసారి విచారణకు రాగా, రాధాకృష్ణన్ వివక్ష చూపారని అభిప్రాయపడ్డ విజిలెన్స్ కోర్టు దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.



