వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యుడు, జగన్ కేసులలో రెండో ప్రధాన నిందితుడు విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. శుక్రవారం కోర్టులో హాజరు అవ్వాల్సి ఉన్న రాజ్యసభకు వెళ్లాలని పర్మిషన్ తీసుకుని ఆయన ప్రధానిని కలిశారు. భేటీ విషయం బయటకి పొక్కడంతో హుటాహుటిన సాయంత్రం సాక్షి మీటింగ్ ఎజెండా అంటూ ఒక కార్యక్రమం ప్రసారం చేసింది.
అయితే ఎజెండా చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రధాని మోడీకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పడానికి, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలపడానికి వెళ్లారట. అంతేకాకుండా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్విజయంగా కొనసాగిస్తోన్న ప్రజాసంకల్పయాత్ర వివరాలను, పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన గురించి ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి తెలిపారట.
బీజేపీ విజయానికి విజయ సాయి రెడ్డి శుభాకాంక్షలు చెప్పడం ఏంటో? పాదయాత్ర విశేషాలు మోడీకి ఎందుకు? జగన్ ఎమన్నా బీజేపీ నాయకుడా? లేకపోతే కనీసం వైకాపా బీజేపీ ఒక కూటమిలో ఉన్నాయా? వైకాపా బీజేపీ విరోధి పార్టీలే కనీసం ప్రజలకు చెప్పినంతవరకైన. అటువంటిది మోడీకు జగన్ యాత్ర విశేషాలతో పనేముంది?
దీనిబట్టి వేరే పని మీద ఏదో వెళ్లి, వేరే కారణం ఏదో చెబుతున్నట్టు ప్రజలకు అనిపించకమానదు. నిజంగా బీజేపీతో పొత్తు ప్రయత్నాలు చేస్తే అది తప్పేమి కాదు. అడిగే హక్కు వైకాపాకు ఉంటుంది, అవినీతి మరకలు ఉన్న ఆ పార్టీతో కలిసి వెళ్లాలో లేదో నిర్ణయించుకోవాల్సింది బీజేపీ. ఆ మాత్రం దానికి చీకటి భేటీలు, బయటకి తెలిసాక నమ్మశక్యం కాని అజెండాలు చెప్పుకోనవసరం లేదు.



