ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేడు రాష్ట్రపతి భవన్లో ఎన్టీఆర్ బొమ్మతో ముద్రించిన వంద రూపాయల నాణేలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తన భర్త దగ్గుపాటి వేంకటేశ్వర రావు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులతో కలిసి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వేరేగా భేటీ అయ్యారు.
ఇప్పటికే దగ్గుబాటి పురందేశ్వరిని ఉద్దేశ్యించి ఓ ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, రాష్ట్రపతి భవన్లో వారు జేపీ నడ్డాతో భేటీ అయిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మళ్ళీ తన ఆక్రోశాన్ని మరోసారి బయటపెట్టుకొన్నారు.
“ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురంధేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం. బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటే అని. అందుకేకదా దొంగ చేతికే తాళం ఇచ్చింది!” అని ట్వీట్ చేశారు.
దగ్గుపాటి వేంకటేశ్వర రావు, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఎన్టీఆర్ అల్లుళ్ళే కనుక వారు విభేదించుకొని దూరమైనా వారి మద్య బందుత్వాలు ఎన్నటికీ చెరిగిపోవు. ఎన్టీఆర్ కుటుంబంలో ఇటీవల కొన్ని విషాదాలు జరిగినప్పటి నుంచి మళ్ళీ రెండు కుటుంబాలు కొంత దగ్గరయ్యాయి. దగ్గుపాటి వేంకటేశ్వర రావుకి తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించారు. అప్పటి నుంచే వారి కుటుంబాల మద్య బంధాలు మళ్ళీ కాస్తబలపడ్డాయి.
ఈరోజు ఢిల్లీలో ఈ కార్యక్రమంలో మళ్ళీ అందరూ కలిసినప్పుడు బిజెపి, టిడిపి అధ్యక్షులైన పురందేశ్వరి, చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాల గురించి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకోవాలనుకొంటున్నారనేది కూడా రహస్యమేమీ కాదు.
కనుక ఇదే విషయమై చర్చించుకొనేందుకు వారు సమావేశమై ఉండవచ్చు. ఒకవేళ బిజెపితో వైసీపీకి పొత్తులు ఉండి ఉంటే, వీరి సమావేశంపై విజయసాయి రెడ్డి అభ్యంతరం చెప్పినా అర్దం ఉంటుంది. కానీ రాబోయే ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేసి 175 సీట్లు గెలుచుకొంటామని జగన్ కాలర్ ఎగరేస్తున్నప్పుడు, ఎవరు ఎవరితో కలిస్తే వైసీపీకి ఎందుకు?ఏ పార్టీ దేనితో పొత్తులు పెట్టుకొంటే వైసీపీకి ఎందుకు?
అంటే మూడు పార్టీలు చేతులు కలిపితే ఎన్నికలలో ఓడిపోతామని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని అర్దమవుతూనే ఉంది. టిడిపి, జనసేనలు కలుస్తాయనే వాపోతున్న వైసీపీ నేతలకి ఇప్పుడు బిజెపి కూడా వాటితో కలుస్తుందని తెలిస్తే భరించగలదా? అందుకే ఈ ఆక్రోశం.



