పురందేశ్వరిపై విజయసాయి బాణాలు… రివర్స్ అయితే ప్రమాదం

Daggubati-Purandeshwari-Vijayasai-reddyస్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన గౌరవార్ధం రిజర్వ్ బ్యాంక్ రూ.100 నాణేలు ముద్రించింది. నేడు రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వాటిని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తన తండ్రిని స్మరించుకొంటూ ట్వీట్‌ చేశారు. ఇది చాలా సహజం. కానీ ఎదుటవారు హుందాగా మెలగాలంటూ నిత్యం ట్విట్టర్‌లో సుద్దులు చెప్పే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఓ కూతురు తన తండ్రిని స్మరించుకొన్నా అవహేళన చేస్తూ ఆమెను ఉద్దేశ్యించి ట్వీట్‌ చేయడం చాలా బాధాకరం.

ADVERTISEMENT

“పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!అంటూ a) వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారు. b) అబిడ్స్ లో అయన ఇల్లు అమ్ముకున్నారు. c) బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు. d) దానికి ఎదురు ఉన్న అయన ఇంట్లో మ్యూజియం పెట్టాలనుకున్నారు. అయన ఆశయాలకు నీళ్ళుకొట్టారు. 2/2. తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో హృదయ అంతరంగం నుంచి రావాలేకానీ…పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా! e) సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణెం అంటారు. f) భారతరత్న గురించి మీరు ఢిల్లీలో ఏనాడు అడగలేదు. రాజకీయ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అప్పటి మీ నాయకురాలు సోనియాకు మీరు చెప్పిన హృదయపూర్వక కృతఙ్ఞతలు మరచిపోలేమమ్మా!” అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చేసినప్పుడు వైసీపీలో ఎన్టీఆర్‌ అభిమానులమని చెప్పుకొని తిరిగే ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో సహా ఎంపీ విజయసాయి రెడ్డి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఎన్టీఆర్‌, జూ.ఎన్టీఆర్‌ ఫోటోలతో నేటికీ ఫ్లెక్సీ బ్యానర్లు వేసుకొని రాజకీయాలు చేస్తుంటారు.

దగ్గుబాటి పురందేశ్వరిని, నందమూరి కుటుంబ సభ్యులను వేలెత్తి చూపించే ముందు తమ అధినేత జగన్‌ తన తల్లి, చెల్లి, బాబాయ్‌, సునీతారెడ్డి విషయంలో ఏవిదంగా ప్రవర్తిస్తున్నారో వైసీపీలో విజయసాయి రెడ్డితో సహా ఎవరికైనా మాట్లాడే ధైర్యం ఉందా? దగ్గుబాటి పురందేశ్వరిపై ట్విట్టర్‌లో బాణాలు వేస్తున్న విజయసాయి రెడ్డిపై ఆమె తిరిగి బాణాలు వేస్తే తట్టుకోగలరా? విజయమ్మ, వైఎస్ షర్మిలకు జరిగిన అన్యాయం, అవమానాల గురించి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నప్పుడు అద్దాలమేడలో కూర్చొని ఎదుటవారిపై రాళ్ళు విసరడం అవసరమా?

ADVERTISEMENT
Latest Stories