పరిశ్రమలు, పెట్టుబడుల గురించి వైసీపి మాట్లాడితే….

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐ‌టి కంపెనీలు రప్పించేందుకు చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఇప్పటికే రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రక్రియ పూర్తికాగానే నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు ఆయా సంస్థలు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి.

అయితే ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా ప్రవహిస్తున్నాయంటూ డప్పు కొట్టుకుంటున్నారని, పచ్చ మీడియా ఆహా ఓహో అంటూ పొగుడుతూ హైప్ క్రియేట్ చేస్తోందని వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడుకి ఈ ప్రచారం, హడావుడి, డప్పు కొట్టుకోవడం అలవాటే అని, ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రాఫిక్స్, డప్పులు, హడావుడితో 2019 వరకు కాలక్షేపం చేశారు తప్ప రాష్ట్రానికి ఏమీ చేయలేదని విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. మళ్ళీ ఇప్పుడూ అలాగే హడావుడి చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వలేని పరిస్థితులలో చంద్రబాబు నాయుడు ఎంత సాధించారో అందరికీ తెలుసు. మూడున్నరేళ్ళ తర్వాత బీజేపీతో రాజకీయ విభేధాలు ఏర్పడటంతో ఏపీలో అభివృద్ధి మందగించింది కానీ నిలిచిపోలేదని అందరికీ తెలుసు.

కానీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ఐదేళ్ళలో ఏం సాధించారు? సంక్షేమ పధకాలు, వాటి కోసం చేసిన అప్పులు, తాకట్లు తప్ప మరేవీ కనబడవు. వాటితో రాష్ట్రాన్ని నిలువునా ముంచేసి చివరికి తాను కూడా మునిగిపోయారు.

జగన్‌ దావోస్ పర్యటనకు వెళ్ళి వస్తే తెచ్చిన పెట్టుబడుల కంటే ఆయన ప్రత్యేక విమానం ఖర్చులే ఎక్కువ. తన ధోరణి చూసి రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టరని గ్రహించిన జగన్‌, మళ్ళీ అటువంటి ఆలోచన చేయకపోవడం ఆంధ్రా ప్రజల అదృష్టమనే భావించవచ్చు.

‘జగన్‌ ఇమేజ్‌ చూసి’ రెండు రోజుల విశాఖ సదస్సులో పారిశ్రామికవేత్తలు 13.50 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మంచి స్టోరీ చెప్పారు.

ఆ లక్షల కోట్లు పెట్టుబడులు, పరిశ్రమలు ఎక్కడ పెట్టారో ఆయన కూడా చెప్పలేరు కానీ విశాఖలో ఋషికొండ మీద జగన్‌ రూ.500 కోట్లతో కట్టుకున్న ప్యాలస్‌ మాత్రం నెల్లూరు, చిత్తూరులో ఉన్న ప్రజలకి సైతం స్పష్టంగా కనిపిస్తోంది.

జగన్‌ 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేకపోగా ఉన్న లూలూ గ్రూప్, అమర్ రాజా బ్యాటరీస్ వంటి వాటిని తరిమేశారు. ఉన్న కొన్ని ఐ‌టి కంపెనీలు మూతపడ్డాయి. హెరిటేజ్, సంగం డెయిరీలను దెబ్బ తీసేందుకు గుజరాత్‌ నుంచి అమూల్ డెయిరీని రప్పించారు. గ్రానైట్, ఆక్వా కంపెనీలను వైసీపి నేతలు పీడించగా, జగన్‌ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచేసి దెబ్బ తీసింది.

జగన్‌ అరాచక పాలన, ఆయన ప్రాధాన్యతలు చూసినవారు ఎవరూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తేకపోయినా జగన్‌ని క్షమించవచ్చు. కానీ ఇక ముందు కూడా ఎవరూ వచ్చేందుకు భయపడేలా చేయడం క్షమించరాని నేరమే.

“మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని” జగన్‌ పదేపదే చెపుతున్న మాటలు పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నాయి. వెనకడుగు వేసేలా చేస్తున్నాయి.

కనుక ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి జగన్‌ వలన ప్రమాదం, నష్టం ఉండబోవని నచ్చజెప్పడం సిఎం చంద్రబాబు నాయుడుకి చాలా కష్టమవుతోంది.

అయినప్పటికీ ఈ 5 నెలల్లోనే రాష్ట్రానికి రూ.1.75 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించగలిగారు. అవి నిజమో కాదో రాబోయే రోజుల్లో వైసీపి నేతలు కూడా కళ్ళారా చూడవచ్చు.

Vijayasai Reddy Tweets On Chandrababu Naidu Industries Investment

ADVERTISEMENT
Latest Stories