తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాజకీయాలలో తన రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి ప్రతి ఐదేండ్లకొకసారి తన పార్టీ కండువాను మారుస్తూ తానూ కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సినీరంగంలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగి హీరోలకు సమానమైన క్రేజ్ సంపాందించుకున్న విజయశాంతి రాజకీయాలలో మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారు.
2005 లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన విజయశాంతి 2009 నాటికి ఆ పార్టీని అప్పటి తెరాస పార్టీలో విలీనం చేసి కేసీఆర్ మెచ్చిన తెలంగాణ చెల్లిగా తెరాస లో కొంతకాలం తన రాజకీయాన్ని కొనసాగించారు. సొంత బంధాలకే విలువలేని రాజకీయాలలో అవసరానికి ఏర్పాటు చేసుకున్న అనుబంధాలు ఎంతోకాలం కలిసి ప్రయాణం చేయలేక పోయాయి. అన్న కేసీఆర్ మీద అలిగి 2014 లో కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో,చేరి ఐదేళ్లు గడిచాయి ఇక పార్టీ మారాల్సిన సమయం ఆసన్నమయింది అంటూ కాంగ్రెస్ నుంచి బీజేపీలో కి చేరారు లేడీ బాస్.
బీజేపీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా చెప్పడబడిన విజయశాంతి ఇక బీజేపీకి రాజీనామా చేయాల్సిన సమయం దగ్గరపడింది అనుకున్నారో లేక అక్కడ తనకు అనుకున్నంత ప్రాధాన్యత దక్కలేదనుకున్నారో మళ్ళీ తన స్నేహ హస్తాన్ని కాంగ్రెస్ పార్టీకి అందించనున్నారు.నేడో రేపో ఈ తంతు ముగించుకుని కాంగ్రెస్ కండువా మెడలో వేసుకుని తిరిగి బీజేపీ పార్టీ పై విమర్శలు చేయడానికి సిద్ధమయ్యారు లేడి సూపర్ స్టార్.
సొంత పార్టీ తో మొదలుపెట్టి తెలంగాణాలో బలంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలలో తన రాజకీయ బలాన్ని పరీక్షించుకున్న విజయశాంతి ఈసారైనా తన నిర్ణయం పై నిలబడతారా లేక మరో ఎన్నికలకు మరో కండువా మార్చుకుంటారో చూడాలి.పార్టీలు మార్చినంత సులువుగా తన రాజకీయ గీత మార్చుకోలేకపోతున్నారు విజయశాంతి. తను ఏ రాజకీయ పార్టీని నమ్మలేకపోతుందో లేక ప్రజలే తనను నమ్మలేకపోతున్నారో అర్థం చేసుకోలేని స్థితిలో విజయశాంతి తన రాజకీయ విజయాన్నిపొందలేకపోతున్నారు అనేది సుస్పష్టమయ్యింది.




