అప్పుడు విశాఖ…ఇప్పుడు విజయవాడ…!

Vijayawada Kanakadurgamma Kailasagiri Vizag

ప్రకృతి ప్రకోపానికి ఎంతటి మహా నగరాలైన తలవంచక తప్పదు. అయితే ఆ ప్రకృతి విలయాన్ని సైతం తట్టుకుని ఎంతవరకు ఆ నగరం నిలబడుతుందో అదే మహానగరం మారుతుంది. అయితే ఈ కోవలోకి ఏపీలోని విశాఖ, విజయవాడ నగరాలు తమ బలాన్ని చూపించాయనే చెప్పాలి.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రాన్ని పలకరించిన తొలి ప్రకృతి విపత్తు 2014 హుదూద్ సైక్లోన్. ఈ హుదూద్ ప్రళయంతో విశాఖ నగరం చిగురుటాకులాగా వణికింది. ఈ ప్రళయం తెచ్చిన విధ్వంసంతో విశాఖ నగరం కొన్ని కోట్ల ఆస్తి నష్టాన్ని భరించాల్సి వచ్చింది.

పారిశ్రామిక నగరంగా, ప్రకృతి ప్రేమికుల విహార స్థలంలా, ప్రశాంత వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే విశాఖ నగరం హుదూద్ చేసిన గాయంతో ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఎన్నో ఏళ్ళ నాటి మహా వృక్షాలు కూడా నేలకొరిగాయి. హుదూద్ దెబ్బకు విశాఖ నగరం చెల్లాచెదురయ్యింది.

అలాగే అక్కడి ప్రజలు దాదాపు వారం రోజుల పాటు మంచి నీరు, కరెంటు, ఫోన్ సిగ్నల్స్ ఇలా ఎటువంటి ప్రాథమిక సౌకర్యాలు లేకుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు మీద ఆశతో, ప్రభుత్వాల మీద నమ్మకంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. గంటకు సుమారు 200 km వేగంతో వీసిన ఈదురు గాలులకు పెద్దపెద్ద భవనాలు సైతం కంపించిపోయాయి.

ఇటువంటి మహా విపత్తు నుంచి విశాఖ నగరం కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో అనుకున్న వారికీ తన అనుభవంతో అధికారుల సహకారంతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.

ప్రకృతి ప్రళయానికి తల వంచిన విశాఖను తిరిగి తలెత్తుకునేలా చేసిన తరువాతనే ఈ ప్రాంతం వదిలి వెళ్తా అంటూ అక్కడే బస్సులో ఉంటూ ప్రజల నిత్యావసరాలను మెరుగుపరిచి వారికి ప్రభుత్వం నుండి అందించవలసిన అన్ని సౌకర్యాలను మెరుగుపరిచి వారం రోజులలోనే విశాఖ నగరాన్ని తిరిగి యధాస్థితికి తీసుకు వచ్చారు బాబు.

అలాగే వ్యాపార వాణిజ్య నగరంగా పేరొందిన విజయవాడ కూడా ప్రకృతి ప్రకోపానికి తలవంచింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విజయవాడలో కురిసిన కుండపోత వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో బుడమేరు సృష్టించిన జల ప్రళయం విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి.

బెజవాడ చరిత్రలో కనివిని ఎరుగని వరదను విజయవాడ నగరం ఈ సెప్టెంబర్ మాసంలో చూసింది. ఈ జల ప్రళయం విజయవాడ నగరానికి కొన్ని కొత్త పాఠాలను నేర్పాయి. రోడ్లు నదులను తలపించాయి, వన్ టౌన్, అజిత్ సింగినగర్, బాంబే కాలనీ, రాజరాజేశ్వరి పేట, కండ్రిక వంటి ప్రాంతాలలో కొన్ని కాలనీలు జల సమాధిగా మారాయి.

అయితే ఇంతటి జల ప్రళయాన్ని తట్టుకుని విజయవాడ తిరిగి తన వ్యాపార వాణిజ్యాలను ఎప్పటికి మొదలుపెడుతుందో అనుకుంటే ఇటు ప్రభుత్వ సాయంతో పాటుగా అటు దాతల విరాళాలు కూడా విజయవాడ ప్రజలను తిరిగి కోలుకునేలా చేసాయి.

సెప్టెంబర్ నెలలో విజయవాడ జల ప్రళయాన్ని చూసి దాతల సాయం కోసం చేయిచాచి కూడా అక్టోబర్ నెలలో అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రులు నిర్వహించుకోగలిగింది. అంటే ఒక్క నెలలోపాలే విజయవాడ ఒక విధ్వంసాన్ని కళ్లారాచూసి, ఒక ప్రళయాన్ని తట్టుకుని, ఒక వేడుకకు వేదికయ్యింది.

లక్షలాదిమందిగా తరలివచ్చిన దుర్గమ్మ భక్తులకు విజయవాడ నగరం సాదర స్వాగతం పలుకుతూ పూర్వ వైభవాన్ని తిరిగి పొందింది. దీనితో అప్పుడు విశాఖ ఇప్పుడు విజయవాడ ప్రకృతి ప్రకోపానికి తలవంచిన తిరిగి తలెత్తుకునేలా తమ ఉనికి నిలబెట్టుకున్నాయి. అయితే ఈ రెండు ప్రళయాలకు అటు విశాక ఇటు విజయవాడ ప్రజలకు అండగా ఉంటూ వాటిని యధా స్థితికి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే చెందుతుంది.

ADVERTISEMENT
Latest Stories