మూడు రాజధానుల నిర్ణయం వైసీపీ ని మూడు చెరువుల నీళ్లు తాగించిందనే చెప్పాలి. 2019 ఎన్నికల ఫలితాలు రాష్ట్రానికి ఒక నియంతను తయారు చేస్తే, 2024 ఫలితాలు రాష్ట్రానికున్న నిబద్ధతను సూచించాయి.
నాడు స్మశానం, ముంపు ప్రాంతం అంటూ అమరావతిని సమాధి చేసిన వైసీపీ, నేటికి తన నీలి విషాన్ని ఆ ప్రాంతం పై అక్కడి ప్రజలు పై చిమ్ముతూనే ఉంది. అలాగే విశాఖే ఏపీ రాజధాని అంటూ గత ఐదేళ్లు అటు న్యాయస్థానాలతో, ఇటు రాజకీయ పార్టీలతో, అలాగే అమరావతి రైతులతో పోరాటం చేసిన వైసీపీ చివరికి ఓటమికి తలవంచక తప్పలేదు.
విశాఖే రాజధాని అన్నా 2024 ఎన్నికలలో వైసీపీ ని విశాఖ వాసులు ‘ఉక్కుపాదం’తో తొక్కేశారు, అలాగే అమరావతిని రాజధానిగా తొలగించినందుకు ఇక్కడ వైసీపీ కి ‘సమాధి’ కట్టారు. ఇక “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అంటూ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన విశాఖ ఉక్కు కార్మికుల విషయంలోనూ వైసీపీ ద్వంద వైఖరిని అవలంభిస్తూ వారి ఆగ్రహాన్ని చవి చూసింది.
ఇక రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించిన అమరావతి రైతులను, ఆయా కుటుంబాలను జగన్ ఒకే ఒక్క నిర్ణయంతో నడి రోడ్డుకు తీసుకురావడం, తమకు న్యాయం కావాలి, తమ భూములలో అభివృద్ధి జరగాలి అంటూ సాగిన ఐదేళ్ల అమరావతి రైతుల ఉద్యమాలు, ఆయా రైతు కుటుంబాల కన్నీటి ఉసురు 2024 ఎన్నికలలో వైసీపీ ని కబళించేసింది.
అలాగే, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమాలు, ఆయా కుటుంబాల కన్నీటి వేదనలు వైసీపీ ని కరిగించలేకపోయాయి. అటు కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు గాని ఇటు ఉక్కు కార్మికులతో సమావేశం అయ్యేందుకు గాని జగన్ కు ఐదేళ్ల సమయం సరిపోలేదు.
ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మికుల డిమాండ్లను, ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్న కేంద్ర పెద్దల నిర్ణయాలను అధికారంలో ఉన్న వైసీపీ బేఖాతరు చేస్తూ విశాఖలో భూదందాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
ఉక్కు పరిశ్రమకు సంబంధించిన వేల ఎకరాల భూమి పై ఉన్న ఆసక్తి వైసీపీకి ఉక్కు పరిశ్రమ మీద లేకపోవడం, విశాఖ ను రాజధానిగా ప్రకటించడం పై ఉన్న శ్రద్ద ఆ ప్రాంత అభివృద్ధి పై చూపకపోవడం విశాఖ ఉక్కు కింద వైసీపీ నలగక తప్పలేదు.
రాజధానిగా విశాఖ కు వస్తాము అన్నందుకు విశాఖ వాసులు వైసీపీ కి పొమ్మని పొగపెడితే, రాజధానిగా తొలగిస్తున్నాం అన్నందుకు అమరావతి వాసులు వైసీపీని పాతాళానికి తొక్కారు. దీనితో భవిష్యత్ లో వైసీపీ విశాఖ కు పోగలదా.? అమరావతికి రాగలదా.? అన్న ప్రశ్నకు జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.






