విశాఖ అభివృద్ధికి మెట్రో తోడ్పడుతుందనుకుంటే…

Visakhapatnam Traffic Crisis

జగన్‌ విశాఖని రాజధానిగా చేయాలనుకున్నారు. కానీ రాజధాని ఏర్పాటు ఎలా అనే అవగాహన, చిత్తశుద్ధి లేకపోవడం వలన కనీసం నగరంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టలేదు. ఫ్లై ఓవర్లు నిర్మాణాల గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఆయన అమరావతిని కాదనుకున్నారు కనుక వదిలేశారని సరిపెట్టుకున్నా, విశాఖని రాజధాని చేయాలని అనుకున్నప్పుడు నగరాన్ని అభివృద్ధి చేయాలి కదా? కానీ కొత్తగా ఒక్క రోడ్డు, ఫ్లై ఓవర్ కూడా నిర్మించలేదు. అదే ఇప్పుడు విశాఖకి పెద్ద శాపంగా మారబోతోంది.

ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా వేలెత్తి చూపక తప్పదు. అమరావతి నిర్మాణం విషయంలో పూర్తి స్పష్టత, పక్కా ప్రణాళికతో చకచకా పనులు జరిపిస్తోంది. కానీ విశాఖ విషయంలో తప్పటడుగులు వేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

విశాఖ అభివృద్ధికి మెట్రో తోడ్పడుతుందనుకుంటే ఈ ఆలోచనే నగారాభివృద్ధికి పెద్ద అవరోధంగా మారింది. ముందు మెట్రో నిర్మాణం చేపట్టాలనుకుంది. అయితే మెట్రో కోసం ఒకసారి, ఫ్లై ఓవర్ల కోసం మరోసారి నగరమంతటా పిల్లర్లు నిర్మించడం కంటే డబుల్ డెక్కర్ పద్దతిలో మెట్రో కారిడార్, ఫ్లై ఓవర్లు రెంటికీ ఒకేసారి నిర్మిస్తే బాగుంటుంది కదా? భారీగా డబ్బు సమయం, స్థలం అన్నీ ఆదా అవుతాయి కదా? అనే కొత్త ఆలోచన చేసింది. దీంతో బడ్జెట్ అమాంతం పెరిగింది.

ఇదే సమయంలో రోజుకి 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్న హైదరాబాద్‌ మెట్రో నష్టాలు పాలవడం, దానిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించి ఎల్&టి కంపెనీ తప్పుకుంటోంది.

బహుశః ఇది కూటమి ప్రభుత్వాన్ని పునరాలోచింప జేస్తోందేమో తెలీదు. అందువల్లేనేమో గత ఏడాది అక్టోబర్‌లో మొదలుపెట్టాలనుకున్న విశాఖ మెట్రో నిర్మాణ పనులు నేటికీ మొదలుపెట్టనే లేదు! విశాఖలో ఫ్లై ఓవర్లని మెట్రో ప్రాజెక్టుతో ముడిపెట్టడం పనులు మొదలుపెట్టలేకపోయినట్లు అర్ధమవుతోంది.

విశాఖ నగరాభివృద్ధికి తోడ్పడుతుందనుకున్న ఈ మెట్రో ప్రాజెక్టే అవరోధంగా మారిందని గ్రహించినప్పుడు, కూటమి ప్రభుత్వం ముందుగా దీనికే ప్రాధాన్యత ఇచ్చి తగిన నిర్ణయం తీసుకుని పనులు మొదలుపెట్టి ఉండాలి.

కానీ ఈ చిక్కుముడి విప్పే ప్రయత్నం ఎంత వరకు వచ్చిందో తెలీదు. కానీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై దృష్టి పెట్టి శరవేగంగా నిర్మాణ పనులు జరిపిస్తోంది. మరో 5 నెలల్లో ఈ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఈ విషయం సిఎం చంద్రబాబు నాయుడు, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పదేపదే చెపుతున్నారు.

దాంతో విశాఖ నగరంలో భారీగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. కానీ దానిని తట్టుకునేందుకు వీలుగా నగరంలో రోడ్లు లేవు! మెట్రోతో ఫ్లైఓవర్లను ముడిపెట్టడం వలన నిర్మాణ పనులు ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశం కూడా కనిపించడం లేదు.

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఎన్ఏడీ జంక్షన్‌కి సమీపంలో ఉన్న విశాఖ విమానాశ్రయం నేవీ స్వాధీనం చేసుకుంటుంది. కనుక సామాన్య ప్రజలు విమాన ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా భోగాపురం విమానాశ్రయంకి రావాల్సిందే.

అటు అనకాపల్లి, గాజువాక, ఎన్ఏడీ కొత్తరోడ్డు నుంచి భోగాపురం విమానాశ్రయం చేరుకోవాలంటే నగరంలో కొత్తగా ఒక్క ఫ్లై ఓవర్లు నిర్మించలేదు. కనుక వాహనాలతో కిక్కిరిసిన రోడ్లపై గంటన్నర సేపు ప్రయాణం చేస్తే కానీ భోగాపురం విమానాశ్రయం చేరుకోలేరు. అలాగే అక్కడ దిగినవారికి సైతం ఈ నగర ట్రాఫిక్‌లో ఎదురీత తప్పదు.

భోగాపురం విమానాశ్రయం నుంచి రోజుకి, నెలకు, ఏడాదికి ఎంత మంది రాకపోకలు సాగిస్తారో ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయి. కానీ విమానాశ్రయం నిర్మాణంపై చూపిన శ్రద్ధ నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణంపై చూపకపోవడం వలన ఈ కొత్త సమస్య ఎదురవబోతోంది.

కనుక కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా నగరంలో మెట్రో-ఫ్లై ఓవర్ల నిర్మాణ విషయంలో తక్షణమే తగిన నిర్ణయం తీసుకొని, యుద్ధ ప్రాతిపదికన ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు చేపడితే మంచిది. లేకుంటే అటు విమానా ప్రయాణికులు, ఇటు నగర ప్రజలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రతీసారి కూటమి ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే ఉంటారు.

ADVERTISEMENT
Latest Stories