రాష్ట్రంలో విశాఖ నగరం చాలా ప్రశాంతమైనదిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ వైసీపి ప్రభుత్వం విశాఖను రాజధానిగా నిర్ణయించిన తర్వాత నుంచి నగరంలో భూకబ్జాలు, కిడ్నాపులు, హత్యలు మొదలయ్యాయి.
కొన్ని నెలల క్రితం సాక్షాత్ వైసీపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు కిడ్నాప్ అవడమే ఇందుకు ఓ నిదర్శనం.
తాజాగా విశాఖ రూరల్, చినగదిలి తహసీల్దారుగా పనిచేస్తున్న సనపల రమణయ్యని శుక్రవారం రాత్రి హత్య చేయబడ్డారు.
మధురవాడ వద్ద కొమ్మాదిలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ గేటు వద్దే ఓ వ్యక్తి ఆయన తలపై ఇనుప రాడ్డుతో కొట్టి పారిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన చనిపోయారు.
రమణయ్య ఇటీవలే విశాఖ నుంచి విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం ఉదయం బొండపల్లి వెళ్ళి విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి సుమారు 10 గంటలకు ఫోన్ రావడంతో ఆయన కిందకు వెళ్ళారు.
ఫోన్ చేసిన ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, హటాత్తుగా ఇనుప రాడ్తో ఆయనపై దాడి చేసి పారిపోయాడు. రమణయ్య తలకు బలమైన గాయం అవడం, తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయారు.
ఫోన్ చేసిన వ్యక్తితో రమణయ్యకు పరిచయం ఉన్నందునే ఆయన కిందకు దిగి వెళ్ళి మాట్లాడిన్నట్లు అర్దమవుతూనే ఉంది. ఈ హత్యకు కారణం భూవివాదాలే అని తెలుస్తోంది. పోలీసులు ఇంకా నిర్దారించవలసి ఉంది.
విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత నగరం శరవేగంగా అభివృద్ధి జరగాలి. కానీ అది జరగకపోయినా నగరంలో భూవివాదాలు, భూకబ్జాలు, కిడ్నాపులు, హత్యలు మాత్రం జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. మీడియాలో కూడా ఇటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. తహశీల్దార్ రమణయ్య హత్య ఇందుకు మరో ఉదాహరణ కాదని ఎలా అనుకోగలము?




