ఒకరు ఉక్రెయిన్తో నాలుగేళ్ళుగా యుద్ధం చేస్తున్నారు. మరొకరు ఇరాన్తో రెండు నెలలుగా యుద్ధం చేస్తున్నారు. వారిలో నాలుగేళ్ళ సీనియర్ రెండు నెలల జూనియర్కి ఫోన్ చేసి ఇరాన్తో యుద్ధం-పర్యవసానాలు- శాంతి చర్చలు గురించి మాట్లాడారట.
ఒకరి భాష మరొకరికి అర్థం కాకపోయినా ఇద్దరూ ఏకధాటిగా 90 నిమిషాలు మాట్లాడుకున్నారట!
యుద్ధాలు చేస్తున్న ఇద్దరు పెద్దమనుషులు ప్రపంచ శాంతి గురించి చర్చించుకోవడం విడ్డూరంగానే అనిపిస్తుంది. కానీ ప్రపంచంలో ఇలాంటి వింతలు విడ్డూరాలు కూడా జరుగుతుంటాయని ఇద్దరూ నిరూపించారు.
రష్యా చేత ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపించడానికే ‘పుతిన్ చమురు’పై ఆంక్షలు విధించారు. అందుకు ప్రధాని మోడీ అలిగి ట్రంప్తో మాట్లాడటం మానేశారు కానీ పుతిన్ మాత్రం బాధపడలేదని తాజా సంభాషణతో స్పష్టమైంది.
నిజానికి పుతిన్ కూడా ‘వీకెండ్ పిక్నిక్’ అనుకునే 2022, ఫిభ్రవరి 24న ఉక్రెయిన్కి వెళ్ళి అక్కడ చిక్కడిపోయారు. ఆయనని పది రోజులలో ఒప్పించి పిక్నిక్ ముగిస్తానని చెప్పిన ట్రంప్ నేటికీ ఒప్పించలేకపోతున్నారు.
ఎందుకంటే ఒకరి భాష ఒకరికి అర్థం కాదు. కనుక ఒకరి కోరికలు, ఆలోచనలు కూడా మరొకరికి అర్థం కావు.
తొందరపడి ‘వీకిండ్ పిక్నిక్’కి వెళితే అక్కడ అడ్డంగా చిక్కడిపోతామని తెలిసి ఉన్నప్పటికీ ట్రంప్ కూడా 2026, ఫిభ్రవరి 28న ముహూర్తం పెట్టుకొని ఇరాన్ వెళ్ళి అక్కడ హోర్మూజ్ జలసంధిలో చిక్కడిపోయారు.
బాధని అర్థం చేసుకోవడానికి భాషలు అడ్డుకాదు. కనుక వారిద్దరూ వేర్వేరు భాషల్లో ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకున్నా ఒకరి బాధ మరొకరికి బాగా అర్థమయ్యే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రపంచశాంతి కోసం ఇలాంటి ఓదార్పు కార్యక్రమం చాలా అవసరమే.




