వైసీపీ రాజకీయ అవసరాల కోసం ప్రజాధనంతో నడిపిస్తున్న వాలంటీర్ వ్యవస్థ వలన కలుగుతున్న అనర్ధాల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటపెడితే సిఎం జగన్తో సహా మంత్రులందరూ మూకుమ్మడిగా విరుచుకుపడి ఎదురుదాడి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజమేనని నిరూపించాడు ఓ వాలంటీర్.
విశాఖలోని పెందుర్తి నియోజకవర్గంలో పురుషోత్తపురంలో 95వ వార్డుకు చెందిన గ్రామ వాలంటీర్ వెంకటేష్ ఆదివారం రాత్రి సుజాతనగర్లో ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్న వరలక్ష్మి అనే 73 ఏళ్ళ వృద్ధురాలిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న కొంత సొమ్ము దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.
నెలనెలా ఇంటికి వచ్చి పెన్షన్ తెచ్చి అందించే వాలంటీర్ల పట్ల చాలా కుటుంబాలకు ముఖ్యంగా… మహిళలు, పెద్దవారికి నమ్మకం, అభిమానం ఏర్పడటం సహజం. వాలంటీర్ వెంకటేష్ పట్ల కూడా వరలక్ష్మి కుటుంబానికి అలాగే అభిమానం, నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే అతనికి వరలక్ష్మి కుమారుడు తన చికెన్ షాపులో పార్ట్-టైమ్ ఉద్యోగం కూడా ఇచ్చాడు.
నిన్న రాత్రి ఆయన చికెన్ షాపులో ఉన్నప్పుడు వెంకటేష్ వచ్చి బైక్ అడిగి తీసుకొని వెళ్ళాడు. వాలంటీర్ వెంకటేష్ దానిపై నేరుగా వారి ఇంటికే వెళ్ళి లోన ఒంటరిగా నిద్రపోతున్న వరలక్ష్మిని దిండుతో అదిమి హత్య చేశాడు. ఆమె ఒంటిపై నగలు, ఇంట్లో ఉన్న కొంత సొమ్ము దొంగతనం చేశాడు. తర్వాత బైక్పై మళ్ళీ ఆమె కుమారుడు వద్దకు వెళ్ళి బైక్ తాళం చెవి ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
తర్వాత కధ తెలిసిందే. పోలీసులు వచ్చి అపార్ట్మెంట్లో సిసి టీవీ రికార్డులు పరిశీలించగా రాత్రి 10.22 గంటలకు వాలంటీర్ వెంకటేష్ ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చిన్నట్లు గుర్తించారు. వెంటనే అతనిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే డబ్బు, బంగారం కోసమే తాను వరలక్ష్మిని హత్య చేసిన్నట్లు ఒప్పుకొన్నాడు.
పవన్ కళ్యాణ్ చెప్పిన్నట్లు వాలంటీర్లు అందరూ ఈవిదంగానే ఉండరు. కానీ వారిలో కొందరు ఈవిదంగా కూడా ఉంటారని వెంకటేష్ నిరూపించాడు.
అయితే నెలకు కేవలం రూ.5,000 జీతంతో పనిచేసే వాలంటీర్లు కూడా తమ కుటుంబాలను పోషించుకోవలసి ఉంటుంది. ఆ జీతం కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏమాత్రం సరిపోదని అందరికీ తెలుసు. అంటే వారి ఆర్థిక సమస్యలు ఇటువంటి నేరాలకి ఓ కారణంగా కనిపిస్తోంది.
వారికి ఇటువంటి నేరాలోచనలు లేకపోవచ్చు. కానీ నేరం చేసేందుకు బలమైన కారణాలు, మార్గాలు రెండూ ఉన్నప్పుడు ఇటువంటి నేరాలు జరుగకుండా ఉండవని వెంకటేష్ నిరూపించాడు.
ఒక వాలంటీర్ డబ్బు, బంగారం కోసం ఈ హత్య చేసి ఉండొచ్చు. మరొకరు ఒంటరి మహిళపై అత్యాచారం చేసి ఉండొచ్చు. వేరొకరు మరో రకమైన నేరం చేసి ఉండొచ్చు. అన్నిటికీ ప్రధాన కారణం వాలంటీర్ అనే పేరుతో ప్రతీ ఇంట్లోకి ప్రవేశించగలిగే అవకాశం ఉండటమే కదా?
ప్రజలకు సాయపడాల్సిన వాలంటీర్లే ప్రజలపై ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నా ఈ వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రానికి అవసరమా?అందరూ ఆలోచించాలి.



