తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో పొలమూరులో ఆదివారం గ్రామ టిడిపి అధ్యక్షుడు ద్వారంపూడి ఈశ్వర్ రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ, “మూడేళ్ళ జగన్ పాలనలో నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసగిస్తూనే ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి పేద, మద్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుయిర్కొంటున్నారు.
గడప గడపకు కార్యక్రమంలో తమ వద్దకు వస్తున్న మంత్రులు, ఎమ్మేల్యేలు, వైసీపీ నేతలతో ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకొంటే వారిపై చిర్రుబుర్రులాడి వెళ్లిపోతున్నారే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఏదో వచ్చామా… ఫోటోలు దిగామా… జై కొట్టించుకొన్నామా… వెళ్ళామా… అన్నట్లే సాగుతోంది వారి గడప గడపకి కార్యక్రమం.
ప్రజల తరపున ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై పోలీసులతో వేధిస్తుంటుంది. మూడేళ్ళ జగన్ పరిపాలన చూసి ప్రజలు వేశారిపోయారు. కనుక ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలొస్తాయా… మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు నాయుడుని గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకొందామా… అని ఎదురుచూస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు ఏ శాసనసభలో చంద్రబాబు నాయుడుని అవమానించారో అదే శాసనసభలొ ముఖ్యమంత్రిగా చేసేవరకు మేము విశ్రమించం,” అని అన్నారు.



