ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మార్చి 15న కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని సీబీఐ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి అంటే… గత 5 నెలలుగా ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లోనే ఉన్నారు.
ఈ వారంలో ఆమె బెయిల్పై బయటకు వస్తారని ఆమె సోదరుడు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కనుక మోడీ ప్రభుత్వంతో కేసీఆర్ ఏదో విదంగా రాజీపడి ఉండవచ్చని అందరూ అనుకున్నారు. అలా అనుకోవడం తప్పన్నారు కేటీఆర్. అది తప్పో ఒప్పో తర్వాత తెలుస్తుంది. కానీ ఆయన చెప్పిన్నట్లు కవితకి నిన్న బెయిల్ లభించలేదు!
సోమవారం ఆమె బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఆగస్ట్ 20కి మళ్ళీ వాయిదా వేసింది. కనీసం అంత వరకు మద్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యర్ధనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.
కవిత మహిళ కావచ్చు కానీ శక్తివంతమైన రాజకీయ నేపద్యం కలిగిన మహిళ. కనుక సీబీఐ, ఈడీ వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేయలేమని సుప్రీంకోర్టు చెప్పింది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియా తదితరులందరికీ బెయిల్ ఇచ్చి కవితకు బెయిల్ ఇవ్వకపోవడం ఏమిటనే ముకుల్ రోహత్గీ వాదనలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పట్టించుకోలేదు.
ఆమెకు బెయిల్ మంజూరు చేసే విషయంలో సీబీఐ, ఈడీలు తమ వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ ఈ నెల 20కి ఈ కేసుని వాయిదా వేసింది.
బిఆర్ఎస్ పార్టీతో సహా దేశ ప్రజలందరూ ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నారు. కానీ కల్వకుంట్ల కవితకి మాత్రం ఇంకా స్వేచ్చ లభించలేదు. మరి ఆమెకు జైలు నుంచి స్వేచ్చ, ఈ కేసు నుంచి విముక్తి, మళ్ళీ మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే స్వాతంత్ర్యం ఆమెకు ఇంకా ఎప్పుడు లభిస్తాయో?
మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రి కావలసిన కల్వకుంట్ల కవిత, లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుకొని ఈవిదంగా ఢిల్లీలోనే జైలులో మగ్గుతుండటం విధిలీల అనుకోవాలేమో?




