గత వైసీపీ ప్రభుత్వ అరాచకాన్ని కేసులకు తలొగ్గి, దాడులను తట్టుకుని ఎదిరించిన నిలిచినా నాయకులు, ప్రశ్నించి పోరాడిన నేతలు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా నోరు విప్పడం లేదు. వైసీపీ దౌర్జన్యాల మీద ప్రభుత్వానికి మద్దతుగా వైసీపీ అరాచకాన్ని నిలదీయడం లేదు.
ఉదాహరణకు రచ్చబండ పేరుతో గత ఐదేళ్లు రఘురామ కృష్ణంరాజు వైసీపీ ఎంపీ గా ఉంటూనే పార్టీ అధినాయకత్వం మీద ఎదురుతిరిగారు. దాని ఫలితం RRR ప్రాణాల మీదకు వచ్చింది. అయినా RRR వెనకడుగు వెయ్యలేదు. గత ఐదేళ్ల పాటు ఎంపీగా ఉంటూ కూడా తన సొంత నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు.
అయితే తన ఐదేళ్ల అవమానానికి తగ్గట్టుగానే వైసీపీ ఘోర పరాజయం ముందు తలవంచింది, కూటమి ఘన విజయం అందుకుంది. అలాగే రఘు రామ రాజు ఉండి ఎమ్మెల్యేగా గెలుపొంది, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు.
వైసీపీ RRR మీద ప్రయోగించిన కక్ష్య రాజకీయానికి యావత్ రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీల ప్రముఖులు రాజు గారికి మద్దతు ప్రకటించారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక ఈ ఐదేళ్లు వైసీపీ పై RRR రాజకీయం ఎలా ఉండబోతుంది.? గత రచ్చబండకు అడ్వాన్స్ వర్షన్ లో ఈ ఐదేళ్లు RRR జగన్ పై చెలరేగిపోతారా.? అంటూ అందరి ద్రుష్టి RRR వైపే చూసింది.
కానీ అందుకు భిన్నంగా RRR మౌనాన్ని ఆశ్రయించారు. గత వైసీపీ పాలన అకృత్యాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా, లిక్కర్ స్కాం నుంచి తిరుమల లడ్డు వరకు ఏ అంశంలోనూ RRR అనుకున్న స్థాయిలో వైసీపీ పై విమర్శలు ఎక్కుపెట్టలేదు.
అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతం గత ఐదేళ్లు వైసీపీ అక్రమాల పై గళం విప్పినవారే. అయితే వీరంతా కూడా నాడు వైసీపీ పార్టీ లో ఉంటూ జగన్ నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ బయటకు వచ్చారు.
అయితే నాడు ప్రతిపక్షంలో ఉంటూ కూడా అధికార వైసీపీ మీద పోరాడడానికి అంత తెగువ, తెగింపు చూపిన నేతలు ఇప్పుడు అధికారంలో ఉంటూ కూడా మిన్నకుండిపోతున్నారు..వై.? వీరి నోటికి కూటమి ప్రభుత్వం కళ్లెం వేస్తుందా.? లేక ఆయా నేతలే జగన్ 2.0 నినాదంతో నోటికి తాళం వేసుకుంటున్నారా.?




