చంద్రబాబుకి వచ్చిన గుర్తింపు కేసీఆర్‌కి ఎందుకు రాలేదు?

chandrababu-naidu-kcr

తెలంగాణ టైగర్ కేసీఆర్‌ జాతీయ స్థాయి రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఉద్దేశ్యంతో తన టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు.

ADVERTISEMENT

పార్టీ పేరులో అక్షరం మార్చుకున్నారు కానీ ఆయనలో ప్రాంతీయవాదం అలాగే ఉంది. ఎక్కడా జాతీయవాదం, జాతీయస్పూర్తి కనిపించదు.

అందుకే ‘దేశ్ కీ నేత కేసీఆర్‌’ అంటూ తన పార్టీ నేతల చేత ఎంత డప్పు కొట్టించుకున్నా, దేశ ప్రజలు ఆయనని గుర్తించనేలేదు. చివరికి తెలంగాణ ప్రజలే ఆయననని గద్దె దించేశారు.

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్‌లాగా ఏనాడూ ప్రగల్భాలు పలకలేదు. జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేయలేదు. కానీ జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్నారు. జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కేసీఆర్‌కు రాని గుర్తింపు చంద్రబాబు నాయుడుకి ఎలా వచ్చింది?అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ జాతీయస్పూర్తితోనే మాట్లాడుతుంటారు. జాతీయవాదానికే కట్టబడి ఉంటారు కనుకనే.

ఇందుకు రెండు తాజా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తెలంగాణలో రాజకీయాలలో పైచేయి సాధించేందుకు కేసీఆర్‌ ఎప్పుడూ చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిస్తుంటారు. బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీళ్ళని ఆయన ఏపీకి తరలించుకుపోతుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తోందని రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతూ ప్రాంతీయవాదంతో రాజకీయాలు చేస్తున్నారు.

కానీ ఇదే సమస్యపై సిఎం చంద్రబాబు నాయుడు చాలా భిన్నంగా స్పందించారు. ఎగువన ఉన్న తెలంగాణలో గోదావరి నదిపై మరిన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుని, సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్ళని అన్ని జిల్లాలకు పారించుకుంటే దిగువన ఉన్న ఏపీకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు.

ఆ విదంగా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్ళని మాత్రమే తాను బనకచర్ల ద్వారా కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు తరలిస్తున్నాము తప్ప తెలంగాణ వాటాలో నీటిని కాదన్నారు.

అంటే కేసీఆర్‌ ప్రాంతీయవాదం ప్రదర్శిస్తే, సిఎం చంద్రబాబు నాయుడు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల బాగు గురించి ఆలోచించి జాతీయస్పూర్తితో వ్యవహరించారన్న మాట.

తెలంగాణలో కేసీఆర్‌ ఏవిదంగా తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తుంటారో అదేవిదంగా తమిళనాడులో అధికార, ప్రతిపక్షాలు కూడా కులం, భాష, ప్రాంతీయవాదంతో రాజకీయాలు చేస్తుంటాయి. హిందీని వ్యతిరేకిస్తూ సిఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు తాజా నిదర్శనం.

అటువంటి పార్టీలు తనకు ఆదర్శమని కేసీఆర్‌ అంటుంటే, సిఎం చంద్రబాబు నాయుడు ఏపీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషలు మాత్రమే కాదు.. పది జాతీయభాషలను ప్రమోట్ చేస్తాను. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలు కూడా నేర్చుకునేందుకు వీలుగా పాలసీ రూపొందిస్తాను.

ఎవరు ఏ భాష నేర్చుకోవాలనుకుంటే అది నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తాను. అప్పుడే యువత దేశవిదేశాలలో ఎక్కడికైనా వెళ్ళి చదువుకోగలరు. ఉద్యోగాలు సంపాదించుకోగలరు,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబు నాయుడు ఆలోచనలోనే జాతీయస్పూర్తి కనిపిస్తుంటుంది. కానీ కేసీఆర్ ఆలోచనలు, మాటలు, చేతల్లో కూడా ప్రాంతీయవాదమే స్పష్టం కనిపిస్తుంటుంది.

మాతృభాష తెలుగుకి తన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని కానీ అంత మాత్రాన్న మూర్ఖంగా ఇతర భాషలను వ్యతిరేకించమని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. మనిషికి భాష, జ్ఞానం రెండూ ముఖ్యమని అందుకోసం ఈ ప్రాంతీయ పరిధులకు అతీతంగా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, ప్రయత్నాలు చాలా అవసరమని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

ఈవిదంగా జాతీయస్పూర్తితో మాట్లాడుతూ వ్యవహరిస్తుండటం వలననే సిఎం చంద్రబాబు నాయుడుకి జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.

కానీ మోడీ, రాహుల్ గాంధీలకి వ్యతిరేకంగా మాట్లాడితే జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందనుకుంటున్న కేసీఆర్‌ సరిగ్గా అదే కారణంగా దేశప్రజల దృష్టిలో ప్రాంతీయస్థాయి నాయకుడుగా మిగిలిపోయారు. ఇద్దరికీ ఇదే తేడా.

ADVERTISEMENT
Latest Stories