ఒక వ్యక్తి గురించి సమాజం ఏమనుకుంటోందనేది చాలా ముఖ్యమే… ముఖ్యంగా సినీ రాజకీయ రంగాలలో ఉన్నవారి గురించి. వారి జీవితాలు, వారి భవిష్యత్తుపై దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక హీరో లేదా హీరోయిన్ లేదా రాజకీయ నాయకుడుకి ప్రజలలో మంచి పేరుంటే వారి జీవితం ఒకలా, లేకుంటే మరొకలా ఉంటుంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు, వారి సొంత మీడియా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గురించి ఎంత అనుచితంగా మాట్లాడుతుంటారో, ఎటువంటి నీచమైన విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారో అందరూ వింటూనే ఉన్నారు.
చంద్రబాబు నాయుడుని జగన్ ద్వేషిస్తారు కనుక ఆ ద్వేషాన్నే తన పార్టీ విధానంగా మార్చేసుకున్నారు. కనుక వైసీపీలో ఉన్నవారందరూ ఆ విధానానికి కట్టుబడి చంద్రబాబు నాయుడుని కించపరుస్తూ మాట్లాడక తప్పదు. కనుక ఇది వారందరి అభిప్రాయమని అనుకోవడానికి లేదు. కానీ జగన్ కోసం వారు తమ అభిప్రాయాలను, ఆలోచనా ధోరణిని మార్చేసుకొని చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా ప్రవర్తిస్తునందున అది వారి అభిప్రాయంగానే పరిగణించాల్సి ఉంటుంది.
చంద్రబాబు నాయుడు పట్ల వైసీపీ నేతల అభిప్రాయలు ఈవిదంగా ఉన్నాయి కనుక లోకం అంతా ఆయన గురించి చెడ్డగానే భావిస్తుందా?అంటే కానే కాదు.
ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి ఐటి కంపెనీలు తెచ్చి తమ జీవితాలు మార్చేసినందుకు నాటి ఐటి నిపుణులు నేటికీ చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉన్నారు.
ఆ రోజుల్లోనే హైదరాబాద్లో ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేయించినందుకు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయించినందుకు పూర్వ విద్యార్ధులు నేటికీ చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉన్నారు.
చంద్రబాబు నాయుడుని జగన్ జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్లో ఐటి ఉద్యోగులు రోడ్లపై నిరసనలు తెలియజేయడమే ఇందుకు నిదర్శనం.
శనివారం మంగళగిరిలో జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సిఎం చంద్రబాబు నాయుడు గురించి చెప్పిన మాటలు అయన గొప్పదనాన్ని తెలియజేస్తాయి.
“నాయకులకు సరైన విజన్ (దూరదృష్టి) లేకపోవడం మన దేశంలో అతి పెద్ద సమస్య. భవిష్యత్తు, అభివృద్ధి గురించి విజన్ చాలా ముఖ్యం.
తెలివితేటలు, నైపుణ్యాలనే రెండు వనరులతో సంపద సృష్టించడం గురించి తరచూ వింటున్నాను. వాటిని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఆచరణలో చేసి చూపిస్తున్నారు.
ఎప్పటికప్పుడు అందివస్తున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అందుబాటులో ఉన్న వనరులతో సిఎం చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడం ఎలాగో చేసి చూపిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటారు. ఇటువంటి దూరదృష్టి కలిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తాపత్రయం ఉన్న చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ప్రజల అదృష్టం.
దేశాభివృద్ధి కోసం పరితపించే వారందరికీ చంద్రబాబు నాయుడు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. భవిష్యత్తు గురించి ఇటువంటి ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు కలిగిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో శరవేంగా అభివృద్ది చెందుతుంది,” అని ప్రశంశించారు.
ప్రజలు, మేధావులు, కేంద్రంలో ఉన్న ఇటువంటి పెద్దలు సిఎం చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. వారందరూ చంద్రబాబు నాయుడు పట్ల సదాభిప్రాయం కలిగి ఉన్నారు. ఆయనపై పూర్తి నమ్మకం కలిగి ఉన్నారు.
కనుక జగన్, కేసీఆర్ లేదా మరొకరు చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకుంటున్నారు?అని ఆలోచించడం కూడా అనవసరమే.






